మళ్లీ ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరలు

By ramya neerukondaFirst Published Sep 6, 2018, 11:50 AM IST
Highlights

గురువారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు పెంచాయి. దీంతో పాత రికార్డులను బద్దలుకొట్టి.. ఇంధన ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. బుధవారం ధరలు పెరగకుండా స్థిరంగా ఉండటంతో వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నా.. ఆ ఆనందం ఒక్క రోజుకే పరిమితమైంది. గురువారం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు పెంచాయి. దీంతో పాత రికార్డులను బద్దలుకొట్టి.. ఇంధన ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి.

తాజా ధరల ప్రకారం.. దేశ రాజధాని దిల్లీలో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర 20 పైసలు పెరిగి రూ. 79.51గా ఉంది. ముంబయిలో రూ. 86.91, చెన్నైలో రూ. 82.62, కోల్‌కతాలో రూ. 82.41గా ఉంది. ఇక లీటర్ డీజిల్‌ ధర దిల్లీలో 21 పైసలు పెరిగి రూ. 71.55గా ఉంది. ముంబయిలో రూ. 75.96, చెన్నైలో రూ. 75.61, కోల్‌కతాలో రూ. 74.40గా ఉంది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతుండటం, ముడి చమురు ధరలు పెరగడంతో గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చేరుకుంటున్నాయి. అయితే ఇంత పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సానుకూల స్పందన రాకపోగా.. ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ఆలోచనేదీ లేదని కేంద్రం చెబుతోంది. దీంతో వాహనదారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

click me!