
ఏటా శబరిమలకు యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత సీజన్లో డిసెంబర్ 25 వరకు మొత్తం 31,43,163 మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారు.
శబరిమల ఆలయ ఆదాయం మంగళవారం రూ.200 కోట్లు దాటిందని ట్రావెన్కోర్ దేవసం బోర్డు(Travancore Devaswom Boards) నివేదించింది. ఏటా రెండు నెలల పాటు సాగే శబరిమల యాత్రా కాలం డిసెంబర్ 27న మండల పూజతో ముగుస్తుంది.
ఈ సందర్బంగా డిసెంబర్ 25 వరకు 39 రోజుల్లో ఆలయానికి రూ.204.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవసం బోర్డు తెలియజేసింది.
యాత్రికులు సమర్పించిన నాణేల లెక్కింపు కొనసాగుతోందని, కౌంటింగ్ పూర్తయిన తర్వాత మొత్తం ఆదాయం పెరిగే అవకాశం ఉందని ట్రావెన్ కోర్ దేవసం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
మొత్తం రూ.204.30 కోట్ల ఆదాయంలో రూ.63.89 కోట్లు భక్తులు కానుకలుగా సమర్పించారు. ప్రసాదం విక్రయం ద్వారా రూ.96.32 కోట్లు, అప్పం విక్రయం ద్వారా రూ.12.38 కోట్లు ఆదాయం వచ్చినట్లు దేవసం బోర్డు అధ్యక్షుడు తెలిపారు.
ఏటా శబరిమలకు యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత సీజన్లో డిసెంబర్ 25 వరకు మొత్తం 31,43,163 మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారు.
దేవసం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని, అన్నదాన మండలం ద్వారా డిసెంబర్ 25వ తేదీ వరకు 7,25,049 మందికి ఉచితంగా అన్నదానం చేశామన్నారు.
మండల పూజ అనంతరం శబరిమల బుధవారం రాత్రి 11 గంటలకు మూసివేసి మకరవిళక్కు ఆచారాల కోసం డిసెంబర్ 30న తెరుస్తారు. జనవరి 15న మకరవిళక్కు పూజ నిర్వహించనున్నట్లు ప్రశాంత్ తెలిపారు.