Union Budget 2023: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకకు డ్యామ్ ప్రాజెక్ట్ కోసం రూ. 5,300 కోట్ల ఆర్థిక సహాయం

By Mahesh KFirst Published Feb 1, 2023, 5:15 PM IST
Highlights

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రూ. 5,300 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం చేస్తూ కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
 

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. ఇంకా ఐదారు నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలపై అధికార బీజేపీ కొంత కలవరంలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఎన్నికల కోసం బసవరాజు బొమ్మై ప్రభుత్వం ప్రజాధారణ కార్యక్రమాలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు కేంద్ర బడ్జెట్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చింది. అక్కడ దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ఎగువ భద్ర ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 5,300 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగనున్నాయి. ఈ సారి బీజేపీ దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టుతున్నది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఈ రాష్ట్రంతోపాటు దక్షిణాదిలో బీజేపీ బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. ఈ తరుణంలో జనరల్ ఎలక్షన్‌కు ముందు మోడీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్‌లో కర్ణాటక రాష్ట్రానికి రూ. 5,300 కోట్ల ఆర్థిక సహాయాన్ని.. అదీ అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కోసం అందించనుంది.

Also Read: Income Tax Slabs: ఈ ఫార్ములా ప్రకారం రూ.7 లక్షల ఆదాయం వరకూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు

‘కరువు ప్రభావిత కర్ణాటక మధ్య ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్, ఉపరితలంలో తాగు నీటి లభ్యతను పెంచే అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌కు రూ. 5,300 కోట్లు ఈ బడ్జెట్‌ అందిస్తుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఈ రోజు తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 

కరువు ముప్పు ఎదుర్కొనే చిక్కమగళూరు, చిత్రదుర్గ, తుమకూరు, దేవంగిరి జిల్లాల్లోని 2.25 లక్షల హెక్టార్ల భూమికి ఈ ప్రాజెక్టు నీటిని అందిస్తుంది.

కర్ణాటకకు రూ. 5,300 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధన్యవాదాలు తెలిపారు.

కర్ణాటక ప్రజల తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. కర్ణాటక భద్ర అప్పర్ బ్యాంక్ ప్రాజెక్ట్ కోసం ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రూ. 5,300 కోట్ల గ్రాంట్ కేటాయించినందుకు థాంక్స్’ అని కర్ణాటక సీఎం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

click me!