దొంగ ఏడ్పు: పుల్లెల గోపీచంద్ పై భగ్గుమన్న జ్వాలా గుత్తా

By telugu teamFirst Published Jan 14, 2020, 9:53 PM IST
Highlights

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై భారత షట్లర్ జ్వాలా గుత్తా భగ్గుమన్నారు. ప్రకాశ్ పడుకొనే వద్ద శిక్షణ తీసుకోవడానికి వెళ్లిన పుల్లెల గోపీచంద్ ఇప్పుడు దొంగ ఏడ్పు ఏడుస్తున్నాడని గుత్తా జ్వాలా అన్నారు.

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా భగ్గుమన్నారు. గోపీచంద్ దొంగ ఏడ్పులు ఏడుస్తున్నాడని ఆమె వ్యాఖ్యానించారు. ప్రకాశ్ పడుకొనే వద్దకు శిక్షణ తీసుకోవడానికి పుల్లెల గోపీచంద్ వెళ్లాడని, ఇప్పుడు ఆయననే తప్పు పడుతున్నాడని ఆమె అన్నారు. 

గోపీచంద్ తన డ్రీమ్స్ ఆఫ్ ఏ బిలియన్, ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్ అనే పుస్తకంలో సైనా నెహ్వాల్ తో గతంలో ఏర్పడిన మనస్పర్థల గురించి వివరించాడు. సైనా నెహ్వాల్ తన శిబిరం నుంచి వెళ్లిపోవద్దని చెప్పినప్పటికీ వినలేదని ఆయన అన్నాడు. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కు (ఓజీక్యూ) సభ్యులైన ప్రకాశ్ పడుకొనే, విమల్ కుమార్, వీరేన్ రస్కినా హైదరాబాదు వీడే విధంగా సైనాను ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. 

ప్రకాశ్ పడుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదని కూడా ఆయన అన్నారు. దీనిపై గుత్తా జ్వాలా ఘాటుగా స్పందించారు. "ఇక్కడ దొంగ ఏడ్పు ఏడుస్తున్న వ్యక్తి... ప్రకాశ్ సార్ వద్ద శిక్షణ తీసుకోవడానికి హైదరాబాదును వదిలి వెళ్లాడు. మరి దీన్ని ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు" అని ఆమె అన్నారు. 

గోపీచంద్ వ్యాఖ్యలపై ప్రకాశ్ పడుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ కూడా స్పందించింది. రియో ఒలింపిక్స్ లో భాగంగా సైనాను హైదరాబాదులోని పుల్లెల అకాడమీ నుంచి బెంగళూరుకు తరలించడంలో తమకు ఏ విధమైన ప్రమేయం లేదని స్పష్టం చేశింది. 

2014లో ప్రపంచ చాంపియన్ షిప్ తర్వాత సైనా నెహ్వాల్ హైదరాబాదులోని గోపీచంద్ అకాడమీని వీడి బెంగళూరులో ప్రకాశ్ పడుకొనే అకాడమీలో చేరింది. అక్కడ రెండేళ్ల పాటు కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంది. తిరిగి గోపీచంద్ అకాడమీకి వచ్చింది. గోపీచంద్ కూడా ప్రకాశ్ పడుకొనే వద్దనే శిక్షణ తీసుకున్నారు.

click me!