న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐ) తాము ఉత్పత్తి చేసే వాహనాల ధరలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాహనాల ధరను గరిష్టంగా రూ.9,200 వరకు పెంచుతున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వివరించింది.
తయారీ వస్తువుల ధరలు పెరగడంతో తాము కార్ల ధరలను పెంచాల్సి వస్తోందని హ్యుండాయ్ వివరించింది. పెంచిన ధరలు కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన వెన్యూ, విద్యుత్ వినియోగం వాహనం కోనాలకు వర్తించదని హ్యుండాయ్ తెలిపింది.
కార్లలో భద్రతా ప్రమాణాల పెంపు దిశగా కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయని హ్యుండాయ్ పేర్కొంది. వీటిని అందిపుచుకునేందుకు సంస్థ గతంలో కంటే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని అందుకే ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టుగా హ్యుండాయ్ వివరణ ఇచ్చింది.
వివిధ విభాగాల్లో 10 కారు మోడళ్లను హ్యుండాయ్ విక్రయిస్తోంది. హ్యుండాయ్ పోర్ట్ఫోలియోలో శాంట్రో, గ్రాండ్ ఐ10, యాక్సెంట్, వెర్నా, క్రెటా, టక్సన్ వంటి మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.3.9- 26.95 లక్షల శ్రేణిలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే మే 21వ తేదీన ఆవిష్కరించబడిన కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారు వెన్యూ బుకింగ్స్లో రికార్డు నెలకొల్పుతోంది. మే రెండో తేదీ నుంచే ప్రీ బుకింగ్స్ నమోదైన వెన్యూ కారు కోసం ఈ నెల 22వ తేదీ నాటికి 45 వేల యూనిట్ల మార్కుకు చేరుకున్నది.
హ్యుండాయ్ వెన్యూ కారు ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన విటారా బ్రెజా, టాటా నెక్సన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్ యూవీ 300 మోడల్ కార్లతో గట్టిగా పోటీ పడుతోంది. మే నెలాఖరు నాటికే 20 వేలకు పైగా బుకింగ్ నమోదు చేసుకున్నాయి.
గత నెల మధ్య వరకు పేర్లు రిజిస్టర్ చేసుకున్న వారు ఇంకా ఒకటిన్నర, రెండు నెలల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల 21వ తేదీ నాటికి 1000 యూనిట్లు డెలివరీ చేసింది హ్యుండాయ్ మోటార్స్.