
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు. గురువారం ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంటున్నారని కామెంట్ చేశారు.
సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే బాబు...పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలెట్టారని ఎద్దేవా చేశారు. ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నారని విజయసాయి మండిపడ్డారు.
అంతకు ముందు మరో ట్వీట్లో.. ‘‘ అమూల్ రాకతో వరి పండించే రైతులే కాదు పాడి రైతులు కూడా అదనపు ఆదాయంతో ఆనందంగా ఉన్నారు. మరి రాష్ట్రం ఇచ్చిన జీవోలను భోగిమంటల్లో వేయమంటారేంటి చంద్రబాబు గారూ? హెరిటేజ్ కంపెనీ ఆదాయం తగ్గినా లక్షలాది రైతులకు లాభం జరిగిందిగా! రైతు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.