స్టీల్ ప్లాంట్ రగడ: ఇలా చేయండి.. కేంద్రానికి విజయసాయి సూచనలు

Siva Kodati |  
Published : Feb 09, 2021, 06:30 PM IST
స్టీల్ ప్లాంట్ రగడ: ఇలా చేయండి.. కేంద్రానికి విజయసాయి సూచనలు

సారాంశం

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ప్రైవేటీకరణ విషయాన్ని పునరాలోచించాలని ప్రధానికి లేఖ రాశారు. 

మరోవైపు ఢిల్లీలో వైసీపీ ఎంపీలు సైతం కేంద్ర పెద్దలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకించి ఐరన్ గనులు లేకపోవడమే నష్టాలకు కారణమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఒడిశాలోని ఐరన్ గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆర్ధిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసే అంశాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని.. ప్రైవేటీకరణకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు.

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. టీడీపీ అధికారంలో వున్నప్పుడు 56  సంస్థలను అమ్మేశారని.. అలాంటిది విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాడతామంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా 4.11 శాతానికి తగ్గిందని.. జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వైసీపీ ఎంపీ అభిప్రాయపడ్డారు.

పీఎం కిసాన్ పథకంలోనూ రాష్ట్ర వాటా తగ్గిందని.. నరేగాకు గతంలో రూ.1.11 లక్షల కోట్లు కేటాయిస్తే.. ఈసారి కేవలం రూ.73వేల కోట్లకు పరిమితం చేశారని ఆయన దుయ్యబట్టారు.
 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu
YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu