
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ కోవర్టుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. శుక్రవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవలనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిపై రోజా విమర్శలు గుప్పించారు.కేసీఆర్ కి 28 వంటకాలతో చంద్రబాబు విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్ రెడ్డికి గుర్తు లేదా అని ఆమె ప్రశ్నించారు. రైతులను దగా చేసిన ప్రభుత్వం చంద్రబాబుదన్నారు. రైతుల సంక్షేమం కోసం జగన్ సర్కార్ అనేక కార్యక్రమాలను చేపట్టినట్టుగా ఆమె గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు పంట కొనుగోలు వరకు జగన్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న జలవివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆమె అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి తమ వాటా నీటిని తీసుకుపోవడంలో తప్పేమిటని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్లు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేాయాలని తెలంగాణకు ఆదేశాలు ఇవ్వాలని కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదుల మేరకు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ కూడ లేఖలు రాసింది. కేఆర్ఎంబీకి తెలంగాణ కూడ లేఖ రూపంలో తన వాదనను విన్పించింది.