విశాఖ ల్యాండ్ స్కామ్‌: పప్పుబెల్లాల్లా పంచుకుంటే ఊరుకోవాలా.. చంద్రబాబుపై అంబటి విమర్శలు

By Siva KodatiFirst Published Jun 15, 2021, 9:10 PM IST
Highlights

విశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలు చేశారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు.

విశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలు చేశారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ భూముల స్వాధీనంపై ఎల్లోమీడియా గగ్గోలు పెడుతోందని అంబటి మండిపడ్డారు. లీజులు ముగిసినా కూడా భూములు ఖాళీ చేయలేదని ఆయన వెల్లడించారు. 

గతంలో చేసిన వ్యాఖ్యలు అయ్యన్న మర్చిపోయారా? భూ కబ్జాలపై అప్పటి మంత్రి అయ్యన్న ఫిర్యాదు చేసింది గుర్తులేదా? అని రాంబాబు  ప్రశ్నించారు. విశాఖలో భూ కబ్జాలపై ఎల్లో పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని.. ముస్లిం వక్ఫ్‌ భూములను కూడా టీడీపీ నేతలు వదల్లేదని మండిపడ్డారు. టీడీపీ నేతల భూకబ్జాలను చంద్రబాబు సమర్ధిస్తారా?. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటే కక్షసాధింపు ఎలా అవుతుందని అంబటి ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచుకుంటే చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు. చంద్రబాబుకు అధికార, ధనకాంక్ష తప్ప మరో ఆలోచన లేదని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. 

Also Read:చంద్రబాబు అండతోనే టీడీపీ నేతల కబ్జాలు: మంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖ టీడీపీ నేతల భూ కబ్జాల్లో చంద్రబాబుకూ వాటా ఉందని అంబటి ఆరోపించారు. భూ కుంభకోణం మీద చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. విశాఖ కబ్జా నగరంగా ఉండాలో.. మహానగరంగా ఉండాలో చంద్రబాబు చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు. విశాఖ భూముల కబ్జాపై చర్చ జరగకుండా..  నిరసనలు అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఉనికి కోసమే పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడ ఆందోళనలకు చంద్రబాబు పిలుపునిస్తున్నారని రాంబాబు వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు పరాయి దేశాల్లో ఉంటూ హెచ్చరికలు జారీ చేసినట్టు, పక్క రాష్ట్రంలో ఉంటూ నిరసనలకు చంద్రబాబు పిలుపునిస్తున్నారని అంబటి మండిపడ్డారు. 

విశాఖ భూస్కాములపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని.. ప్రజల మీద కాదు భూముల మీదే చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ అంటూ సెటైర్లు వేశారు. అమరావతిలోనూ.. విశాఖలోనూ టీడీపీ ల్యాండ్ స్కాములకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. విశాఖలో భూ బకాసురులను తన్నడానికి కూడా విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాడు అయ్యన్నపాత్రుడు చెప్పలేదా అని రాంబాబు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో విశాఖలో లక్ష ఎకరాల ఎఫ్ ఎంబీలు గల్లంతు అయ్యాయని మీ కేబినెట్ మంత్రి చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. 

click me!