
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పుంగనూర్ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొంటూ అధికార వైసీపీ.. ఈరోజు చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే కుప్పం, పలమనేరు, పుంగనూరులలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. పలుచోట్ల వైసీపీ శ్రేణులు చంద్రబబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు.
ఇదిలాఉంటే.. పుంగనూర్ ఘటనలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను శనివారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు పరామర్శించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్పీ గానీ, డీఎస్పీ గానీ చాలా బాగా చాకచాక్యంగా అడ్డుకున్నారు. పోలీసులు చాలా సమన్వయం పాటించారని.. దెబ్బలు తగిలిన కూడా చాలా ఓపికతో వ్యవహరించారని అన్నారు. పుంగనూర్ బైపాస్ నుంచి వెళ్తామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారని.. ఆ తర్వాత కావాలనే పుంగనూర్లోకి వెళ్లాలని ప్రయత్నించారని విమర్శించారు. అనంతరం పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేసేలా చేశాడని ఆరోపించారు. పోలీసులపై ఈ స్థాయిలో దాడి జరిగిన ఘటనలు ఇటీవలి కాలంలో లేవని అన్నారు.
తాను కుప్పంలో తిరుగుతున్నానని.. ఓటమి భయంతోనే పుంగనూర్లో చంద్రబాబు ప్రీ ప్లాన్తో దాడి చేశారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. రాజకీయంగా చంద్రబాబు దివాళా తీశారని.. అంతులేని ఆవేదనతో బాధపడుతున్నారని సెటైర్లు వేశారు. కుప్పంలో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు నీచానికి దిగారని విమర్వించారు. ఈ ఘటనకు సంబంధించి కచ్చితంగా బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు, ప్రభుత్వానికి ఇది ప్రతిష్టాత్మకమని అన్నారు.
ఇదిలాఉంటే, పుంగనూరులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను శుక్రవారం జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘర్షణల్లో 50 మంది పోలీసులు గాయపడ్డారని, వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. పుంగనూరు పట్టణంలోకి ప్రవేశించేందుకు పోలీసుల అనుమతి లేకపోవడంతో బైపాస్ రోడ్డుపై 400 మంది పోలీసులను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే దుండగులు తమ వాహనాల్లో కర్రలు, మారణాయుధాలు, రాళ్లను తీసుకురావడమే కాకుండా.. హింసకు, రాళ్లదాడికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. పోలీసులపై దాడి చేసి రెండు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారని తెలిపారు. హింసకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని తెలిపారు.