
YS Sharmila : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై మరోసారి సీరియస్ అయ్యారు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ కారుకింద పడి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంపై షర్మిల రియాక్ట్ అయ్యారు. అసలు బెట్టింగ్ వ్యవహారంలో చనిపోయిన వ్యక్తి విగ్రహం పెట్టడమే తప్పు... అలాంటిది ఆ విగ్రహాన్ని ప్రారంభించేందుకు వైఎస్ జగన్ భారీగా జనాలను వేసుకుని వెళ్లడం మరింత తప్పు అని అన్నారు. జగన్ తప్పు ఒప్పుకుని ప్రాణాలు కోల్పోయిన సింగయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని షర్మిల సూచించారు.
తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో శ్రీకాళహస్తిలో జరిగింది... ఇందులో పాల్గొన్న షర్మిల మీడియాతో మాట్లాడుతూ తన అన్న జగన్ తీరుపై స్పందించారు. జగన్ వాహనం కింద సింగయ్య ప్రమాదవశాత్తు పడినా కనీస మానవత్వం ప్రదర్శించి గాయాలతో పడివున్న అతడిని హాస్పిటల్ కు తరలించాల్సిందని షర్మిల అన్నారు. వైసిపి నాయకులు అమానవీయంగా వ్యవహరించడంవల్లే సింగయ్య ప్రాణాలు కోల్పోయాడు... ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. జగన్ ఇది గమనించకపోవచ్చు... కానీ వీడియోలో స్పష్టంగా తన కారు కిందనే పడ్డాడని తెలుస్తున్నాక కూడా ఆ వీడియోనే ఫేక్ అనడం దారుణమని షర్మిల ఆగ్రహం వ్యక్త చేాశారు.
సింగయ్య మరణానికి వైఎస్ జగనే కారణమని స్పష్టంగా తెలుస్తోంది.. కాబట్టి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఆయనదేనని షర్మిల అన్నారు. ఇప్పటికైనా మానవత్వాన్ని ప్రదర్శించి సింగయ్య కుటుంబానికి రూ.5 లేదా రూ.10 కోట్లు పరిహారంగా ఇచ్చి తనవల్లే ప్రాణం పోయింది... క్షమించాలని అడగాలని జగన్ కు షర్మిల సూచించారు. సింగయ్య ప్రమాదానికి గురయిన సమయంలో జగన్ తో కారులో ఎంతమంది ఉన్నారో అందరినీ విచారించాలని షర్మిల ప్రభుత్వాన్ని సూచించారు.
ఎక్కడ ప్రజలు తనను మరిచిపోతారోనని వైఎస్ జగన్ భయపడుతున్నాడని... అందుకే అధికారం పోగానే ప్రజా సమస్యలు అంటూ బలప్రదర్శన చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. జగన్ వద్ద బాగా డబ్బులున్నాయి... వాటిని ఖర్చుచేసి తన పర్యటనలకు జన సమీకరణ చేపట్టి ప్రజల మద్దతు ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని షర్మిల అన్నారు. జగన్ బలప్రదర్శన కోసమే ప్రజల్లోకి వెళుతున్నాడు... కాబట్టి అతడి పర్యటనలు అనుమతులు ఇవ్వకూడదని కూటమి ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ షర్మిల.
జగన్ కు నిజంగానే ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలనే చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీకి వెళ్లాలని షర్మిల సూచించారు. అసెంబ్లీ వేదికగా ప్రజలపక్షాన నిలబడి పోరాటంచేసే అవకాశం జగన్ కు ఉంది... కానీ అక్కడికి వెళ్లే దమ్ములేకే ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని అన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజలను పట్టించుకోకుండా కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడు ప్రజాసమస్యలంటూ బయలుదేరడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇక సింగయ్య మృతిపై ఎక్స్ వేదికన కూడా షర్మిల స్పందించారు. ''వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిగారి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు?'' అంటూ మండిపడ్డారు.
'' బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా ? ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాక్షస ఆనందం? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా? కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యత రాహిత్యాని అద్దం పడుతుంది'' అన్నారు.
''బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ గారు, 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పర్మిషన్ కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు? ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్ర పుచ్చారు?'' అని ప్రశ్నించారు.
''ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్ లు చేస్తారు. దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైసిపి చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ గారు ఏం సమాధానం ఇస్తారు? కూటమి ప్రభుత్వం, టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెబుతారు? ఏం చర్యలు తీసుకుంటున్నారు?'' అని షర్మిల ప్రశ్నించారు.