ఎబీ వెంకటేశ్వర రావు కుట్ర: గవర్నర్ తో భేటీ తర్వాత బాబాయ్ హత్యపై జగన్

Published : Mar 16, 2019, 05:15 PM ISTUpdated : Mar 16, 2019, 05:19 PM IST
ఎబీ వెంకటేశ్వర రావు కుట్ర: గవర్నర్ తో భేటీ తర్వాత బాబాయ్ హత్యపై జగన్

సారాంశం

తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతుంటే ఎందుకు చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన బాబాయ్ హత్యలో తెలుగుదేశం పార్టీలో హస్తం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.   

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. తన చిన్నాన్న మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. 

హైదరాబాద్ లో రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన వైఎస్ జగన్ తన బాబాయ్ ను అత్యంత దారుణంగా హత్య చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకు రిపోర్ట్ చేసే పోలీసుల చేత విచారణ చేయిస్తే తమకు న్యాయం ఎలా జరుగుతుందని గవర్నర్ నరసింహన్ ను అడిగినట్లు తెలిపారు. 

ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు తన బాబాయ్ హత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. తాను హత్య గురించి ఎస్పీని అడుగుతుంటే ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు పదేపదే ఎస్పీకి ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారని దీని బట్టి చూస్తుంటే తమకు న్యాయం జరగదని అర్ధమవుతుందన్నారు. 

జమ్మలమడుగు నియోజకవర్గంలో విజయం సాధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపడుతోందన్నారు. తన చిన్నాన్న జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి గెలుపును బాధ్యతగా తీసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆయనను అంతమెుందించారని వైఎస్ జగన్ ఆరోపించారు. 

తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతుంటే ఎందుకు చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన బాబాయ్ హత్యలో తెలుగుదేశం పార్టీలో హస్తం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మనుషుల ప్రాణాలు తీస్తారా ఇది ధర్మమా అంటూ ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి అనుచరుడుగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను చంద్రబాబు వాచ్ మెన్ డిపార్ట్మెంట్ గా మార్చేశారని ఆరోపించారు. 

ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియజేసి రక్షణ కల్పించాల్సిన డిపార్ట్ మెంట్ లో ఉంటూ ఆయన చట్టవిరుద్ధ పనులు చేస్తున్నారంటూ ఆరోపించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేరడానికి మధ్యవర్తిత్వం వహించింది ఏబీ వెంకటేశ్వరరావు అంటూ ఆరోపించారు వైఎస్ జగన్. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావులను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని లేని పక్షంలో మరింత ఆగడాలు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. 
అంతేకాకుండా గ్రామాల్లో సర్వే చేస్తూ వైసీపీ సానుభూతి ఓటర్లను తొలగించే ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. తన చిన్నాన్న ఎంతో సౌమ్యుడు అంటూ చెప్పుకొచ్చారు. ఎవరికి హాని తలపెట్టని వ్యక్తి అని అందరితో ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. 

అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారని చెప్పుకొచ్చారు. తన బాబాయ్ కు సెక్యూరిటీ కావాలని అడిగినా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తన బాబాయ్ హత్య విషయంలో తనకు న్యాయం జరగాలంటే సీబీఐ తో విచారణ జరిపించాలని కోరారు. రెండు రోజుల్లో గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.  

PREV
click me!

Recommended Stories

Rammohan Naidu Speech:అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయఅభివృద్ధికి కీలక ముందడుగు| Asianet News Telugu
జువ్వలదిన్నె మత్స్యకారుల ఘటనపై Minister Anam Ram Narayana Reddy Serious | Asianet News Telugu