జేసీ ఫ్యామిలీకి జగన్ చెక్: గోరంట్ల మాధవ్ తురుపు ముక్క

By Nagaraju TFirst Published Jan 26, 2019, 2:25 PM IST
Highlights

అనంతపురం జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న మాధవ్ ను జేసీపై ఉసిగొల్పాలని భావిస్తోంది. మాధవ్ తో మాటల దాడికి దిగాలని వ్యూహ రచన చేస్తోంది.   

అనంతపురం: టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తానంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కదిరి మాజీ సీఐ గోరంట్ల మాధవ్ ఎట్టకేలకు వైసీపీలో చేరారు. జేసీకి వార్నింగ్ ఇచ్చి ఒక్క అనంతపురంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా హల్ చల్ చేశారు మాధవ్. 

ఆరు  సార్లు తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, ప్రస్తుతం అనంతపురం ఎంపీగా కొనసాగుతున్న జేసీకి సీఐ మాధవ్ ఝలక్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జేసీని ఎదుర్కొనే వ్యక్తి వచ్చాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.

దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఐ మాధవ్ పై ఫోకస్ పెట్టింది. వైసీపీ జిల్లా నాయకత్వం ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించింది. అంతేకాదు రాజకీయ భవిష్యత్ పై భరోసా ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. దీంతో సీఐ పదవికి రాజీనామా చేసిన మాధవ్ శనివారం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

అనంతపురం జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న మాధవ్ ను జేసీపై ఉసిగొల్పాలని భావిస్తోంది. మాధవ్ తో మాటల దాడికి దిగాలని వ్యూహ రచన చేస్తోంది.   

అయితే గోరంట్ల మాధవ్ ను అసెంబ్లీకి  పంపిస్తారా లేక పార్లమెంట్ కి పంపిస్తారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాధవ్ ని బరిలోకి దించాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  

ప్రస్తుతం హిందూపురం వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్తగా నదీమ్ ఉన్నారు. అయితే నదీమ్ ను అసెంబ్లీ స్థానానికి మార్చి ఆయన స్థానంలో మాజీ సీఐ గోరంట్ల మాధవ్ ని బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీలో చర్చ జరుగుతుంది.  

హిందూపురం పార్లమెంట్ పరిధిలో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. అందులోనూ సీఐ మాధవ్ బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం కలిసొచ్చే అంశమని జిల్లా నాయకత్వం భావిస్తోంది. లేకపోతే అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఓ నియోజకవర్గ సమన్వయకర్తగా అయినా బరిలోకి దించాలా అన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు.  

మాధవ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై విమర్శల దాడి చేసినప్పుడు పైకి పోలీసు అధికారుల సంఘం ఖండించినప్పటికీ లోలోన మాత్రం మద్దతు ఇచ్చిందంట. ఈ నేపథ్యంలో మాధవ్ ఎన్నికల బరిలో నిలిస్తే పోలీసు కుటుంబాలు, జేసీ వ్యతిరేక వర్గం ఆయనకు మద్దతుగా నిలుస్తారని భావిస్తోంది. 

ఇకపోతే అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ విషయంలో కొరకరాని కొయ్యగా మారిన జేసీ దివాకర్ రెడ్డికి కూడా చెక్ పెట్టొచ్చని భావిస్తోంది. వైసీపీలో రాజకీయ ఆరంగేట్రం చేసిన మాధవ్ రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందోనన్నది వేచి చూడాలి. 

సీఐగా ఉన్నప్పుడు ఆయనకు ఉన్నంత క్రేజ్ రాజకీయాల్లో ఉంటుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వైసీపీ టికెట్ కేటాయించకపోయినా, ఎలాంటి పదవి ఇవ్వకపోయినా మాధవ్ పరిస్థితి ఏంటన్నది కాలమే నిర్ణయించాలని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.   

click me!