ఐదురోజుల్లో పెళ్లనగా యువకుడు ట్విస్ట్... కర్నూల్ యువతి సూసైడ్

By Arun Kumar PFirst Published Jun 5, 2023, 11:38 AM IST
Highlights

మరో ఐదురోజుల్లో పెళ్లనగా పెళ్ళికొడుకు ట్విస్ట్ ఇచ్చారు. నిశ్చితార్థం చేసుకున్న యువతిని కాదని మరో యువతిని పెళ్లాడాడు. దీంతో మనస్థాపానికి గురయిన యువతి సూసైడ్ చేసుకుంది. 

కర్నూల్ : మరో ఐదురోజుల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఇంట చావుబాజా మోగింది. పెళ్ళిపీటలు ఎక్కాల్సిన యువతి పాడె ఎక్కింది. తనను పెళ్ళిచేసుకోవాల్సిన వాడు మరొకరని పెళ్లాడటంతో తట్టుకోలేకపోయిన యువతి దారుణానికి ఒడిగట్టింది. తీవ్ర మనోవేదనతో యువతి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... కర్నూల్ పట్టణంలోని ఇందిరాగాంధీ నగర్ కు చెందిన పద్మావతికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. నందికొట్కూరు సమీపంలోని పాతకోటకు చెందిన వినోద్ కుమార్ తో ఈ నెల 10న పద్మావతికి పెళ్లి జరగాల్సి వుంది. బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంచడంతో పాటు పెళ్లికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో వినోద్ మరో యువతిని పెళ్లాడి అందరికీ షాకిచ్చాడు. 

మరో ఐదురోజుల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోవడం పద్మావతి తట్టుకోలేకపోయింది. తనతో నిశ్చితార్థం చేసుకున్నవాడు పెళ్లికిముందు మరో యువతిని పెళ్లాడటం ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో పద్మావతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

Read More  హీరోయిన్ అవ్వాలని, త్వరగా ఎదగాలని.. టెన్త్ చదివే కూతురికి ఇంజెక్షన్లు : పోలీసుల అదుపులో తల్లి

విషం తాగి అపస్మారక స్థితిలో పడివున్న పద్మావతిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోస్టు మార్టం కోసం పద్మావతి మృతదేహాన్ని కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

పద్మావతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆనందంగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లాల్సిన కూతురిని ఇలా స్మశానానికి సాగనంపాల్సి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
 

click me!