నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్పైనా విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ తెలియకుండా అప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు.
అప్పుల వ్యవహారం ఏపీని కుదిపేస్తోందన్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం ఎవరికీ తెలియకుండా అప్పులు చేస్తోందని ఆరోపించారు. కేంద్రానికి తెలుపకుండా అప్పులు చేస్తోందని, ఎఫ్ఆర్బీఎం పరిమితులు దాటి అప్పులు చేస్తోందని రఘురామ వెల్లడించారు. రాష్ట్రాలు ఎంతమేర అప్పులు చేయొచ్చనే దానిపై కేంద్రం ఓ చట్టం చేసిందని, ఏపీ ప్రభుత్వం దాన్ని కూడా అతిక్రమించి అప్పులు చేసే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇది సరైన పద్ధతి కాదని రఘురామ హితవు పలికారు.
ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకుంటున్నారని, బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోందని నివేదించారు. గ్యారంటీలు ఇవ్వలేదని కొందరు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, కానీ ఏ రకంగా గ్యారంటీ ఇచ్చినా గ్యారంటీ గ్యారంటీయేనని రఘురామ స్పష్టం చేశారు.
Also Read:సీఎం జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తాం: రఘురామ కీలక ప్రకటన
అప్పులకు సంబంధించిన నియమ నిబంధనలు సీఎం జగన్ కు స్పష్టంగా తెలిస్తే మాత్రం ఈ విధంగా అప్పులు చేయడానికి అంగీకరిస్తారని తాను అనుకోవడంలేదని ఎంపీ వ్యాఖ్యానించారు. జగన్ తెలిసి అలాంటి తప్పులు చేయరని విశ్వసించారు కాబట్టే ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారని రఘురామ గుర్తుచేశారు. ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి ప్రయత్నించే సీఎం జగన్ దీనిపై సమీక్షించుకోవాలని నర్సాపురం ఎంపీ హితవు పలికారు