చంద్రబాబు... ముందస్తు ఎన్నికలకు సిద్దమా..?

By ramya neerukondaFirst Published Sep 7, 2018, 2:57 PM IST
Highlights

తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సిద్దమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్టుగా.. ఏపీలో చంద్రబాబు కూడా ముందస్తుకి వెళ్లడానికి సిద్ధమేనా అని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాలు విసిరారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన వీరు.. టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

టీడీపీకి ఓ సిద్దాంతం అంటూ లేకుండా చేశారని విమర్శించారు. 1996లో సీపీఐ, సీపీఎంలతో 1999, 2004లో బీజేపీతో, 2009లో మహాకూటమి పేరుతో సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేశారని, 2014లో మళ్లీ బీజేపీతో జతకట్టారని గుర్తు చేశారు. స్వలాభం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని మండిపడ్డారు. 

2009లో తన పరిపాలనపై నమ్మకంతో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి గెలుపు సాధించారన్నారు. చంద్రబాబుకు తన పరిపాలనపై నమ్మకం ఉంటే ముందస్తు ఎన్నికలకు సిద్దమా అని ప్రశ్నించారు. తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సిద్దమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పబ్లిసిటీ కోసం పుష్కరాల్లో 30 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని వాళ్లే చెప్పారని, మహిళల గొంతు కోసి ఇప్పుడు అనైతిక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో టీడీపీ అవినీతికి పాల్పడిందని, అసెంబ్లీలో లేకపోయినా ప్రజల్లో ఉండి పోరాడుతున్నామన్నారు. కాంగ్రెస్‌, బీజీపీతో పొత్తులు పెట్టుకోమని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

click me!