ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సోమవారం పవన్ కల్యాణ్ కు ఓ బహిరంగ లేఖ రాశారు.జనసేన కవాతు సందర్భంగా ఇటీవల ధవళేశ్వరంలో జరిగిన సభలో పవన్ తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
కాకినాడ: తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ను అడిగితే వాస్తవాలు చెప్తారని ఆయన పవన్ కల్యాణ్ కు సూచించారు.
ఆ మేరకు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సోమవారం పవన్ కల్యాణ్ కు ఓ బహిరంగ లేఖ రాశారు.జనసేన కవాతు సందర్భంగా ఇటీవల ధవళేశ్వరంలో జరిగిన సభలో పవన్ తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను కొనుగోలు చేసిన స్థలం విషయంలో వాస్తవాలేమిటో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను అడిగితే తెలుస్తుందని ఆయన అన్నారు.
2014 ఎన్నికల సమయంలో కూడా పవన్ ఇవే ఆరోపణలు తనపై చేశారని గుర్తుచేశారు. నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా తనపై విమర్శలు చేయడం పవన్ కల్యాణ్ కు తగదని ఆయన అన్నారు. నాయకుడు అనేవాడు వాస్తవాలు తెలుసుకొని పూర్తి సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తరువాతే మాట్లాడాలని అభిప్రాయపడ్డారు.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేసి గెలిపించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అవినీతిపై ప్రజాపోరాట యాత్రలో పవన్ మాట్లాడాలని అన్నారు.