ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇప్పటి వరకు ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. ఒకరిని పెళ్లిచేసుకోవడం ఇంట్లో బంగారం తీసుకొని పరారవ్వడం ఈ కిలాడీ లేడీ చేసేపని.
ఒకరికి తెలియకుండా.. మరొకరిని పెళ్లి చేసుకున్న అబ్బాయిలను చూసే ఉంటారు. కానీ.. ఇక్కడ ఈ అమ్మాయి.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇప్పటి వరకు ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. ఒకరిని పెళ్లిచేసుకోవడం ఇంట్లో బంగారం తీసుకొని పరారవ్వడం ఈ కిలాడీ లేడీ చేసేపని. కానీ చివరకు పోలీసులకు చిక్కింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనిక ను ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి 3 నెలల క్రితం వివాహం చేశారు. అమ్మాయి బాగుండడంతో ఎలాంటి కట్నం ఇవ్వక పోయినా ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకున్నారు.
వివాహం జరిగినప్పటి నుంచి ఇద్దరూ సఖ్యతగా ఉంటూ వచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 25న ఆమె తండ్రి అనంతరెడ్డి కుమార్తె వద్దకు వచ్చి తమ కూతురిని పుట్టింటికి తీసుకు పోతున్నట్లు చెప్పి ఆమెను వెంట తీసుకుని బయలు దేరాడు. ఆ తర్వాత వారు పుట్టింటికి వెళ్లలేదు. తిరిగి అత్తగారింటికి రాలేదు. దీంతో కంగారు పడిన మౌనిక భర్త రామకృష్ణారెడ్డి అన్ని చోట్ల విచారించి చివరకు ఫలితం లేకపోవడంతో ఈనెల 9వ తేదీ ఖాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్త ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే నిజాలు తెలిశాయి. ఇక్కడ ఇతినిని వదిలేసి.. హైదరాబాద్ లో మరో యువకుడిని పెళ్లాడింది. ఇలా చేయడం మౌనికకి కొత్త కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు ఆరుగురిని వివాహం చేసుకుంది. కేవలం బంగారం కోసమే వీరందరినీ పెళ్లి చేసుకుందని.. ఆమెకు తండ్రి సహకారం కూడా పూర్తిగా ఉన్నట్లు తెలిసింది. యువతిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.