గ్రామం పేరు మార్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామం పేరు మార్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామాన్ని నేటి నుంచి శివకోటిగా మార్చారు.
ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్రెడ్డి నుంచి జిల్లా కలెక్టర్కు మంగళవారం ఉత్తర్వులు అందాయి. శివకోడు గ్రామానికి చాలా ప్రాధాన్యం ఉంది. శ్రీరామచంద్రుడు రావణ సంహార పాప పరిహారార్థం కోటిలింగాల ప్రతిష్ఠాపన చేస్తూ వచ్చారు. ఆయన శివకోడు గ్రామానికి వచ్చేసరికి కోటిలింగాలు పూర్తికావడంతో గ్రామానికి శివకోటిగా పేరువచ్చిందని ప్రజల నమ్మకం. అయితే తర్వాత కాలంలో శివకోడుగా మారింది.
శివకోడు గ్రామస్థులు ఆరేళ్ల నుంచి గ్రామ పేరును శివకోటిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాజోలు ఎమ్యెల్యే గొల్లపల్లి సూర్యారావు కృషితో నేటికి నెరవేరిందని శివకోడు మాజీ సర్పంచ్ కసుకుర్తి రామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ సభ్యురాలు చాగంటి శిరీష, పందె దుర్గాభవాని, సొసైటీ అధ్యక్షుడు కసుకుర్తి త్రినాథస్వామి, చాగంటిస్వామి, గ్రామశాఖ టీడీపీ అధ్యక్షుడు మెరుగుమువ్వల సత్యవరప్రసాద్, ఆరుమల్లి భాను ఎమ్యెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.