నెల్లూరు కోర్టు చోరీ కేసుపై హైకోర్టు విచారణ:సీబీఐ విచారణకు అభ్యంతరం లేదన్న ఏపీ సర్కార్

By narsimha lodeFirst Published Apr 26, 2022, 12:15 PM IST
Highlights

నెల్లూరు కోర్టులో చోరీ ఘటనను సీబీఐ విచారణ విచారణకు ఇచ్చినా కూడా అభ్యంతరం లేదని ఏపీ సర్కార్ తెలిపింది. ఈ కేసును సుమోటోగా  తీసుకున్న ఏపీ హైకోర్టు ఇవాళ విచారణను ప్రారంభించింది.

అమరావతి: నెల్లూరు కోర్టులో చోరీ కేసును సీబీఐ విచారణకు అప్పగించినా కూడా తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు మంగళవారం నాడు తెలిపింది. 

ఈ చోరీ ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని ఇవాళ విచారించింది. ఈ కేసు విషయమై సీబీఐ విచారణకు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐ డైరెక్టర్, డీజీపీ, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Nellore Court ఆవరణలో చోరీ కేసులో ఈ నెల 17 ఇద్దరిని police అరెస్ట్ చేశారు. సయ్యద్ హయత్ , ఖాజా రసూల్ ను అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ  విజయరావు తెలిపారు.కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీ కోసం  వచ్చిన నిందితులు కుక్కలు వెంబడించడంతో కోర్టు ఆవరణలోకి వెళ్లినట్టుగా పోలీసులు చెప్పారు.

కోర్టు  తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారని SP  వివరించారు.. కోర్టు లోపల ఉన్న బీరువాలో బ్యాగును తీసుకెళ్లారన్నారు. కోర్టులో చోరీకి గురైన అన్ని వస్తువులను రికవరీ చేశామన్నారు.కోర్టులో నిందితులు తీసుకెళ్లిన బ్యాగ్ నుండి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ తీసుకొని మిగిలిన వాటిని నిందితులు పారేశారని ఎస్పీ Vijaya Rao వివరించారు.

నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలోని 4వ అదనపు కోర్టులో ఈ నెల 14న చోరీ జరిగింది.ఈ  చోరీలో పలు కేసులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై మాజీ మంత్రి Somi Reddy Chandra Mohan Reddy వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని  ప్రచారం సాగుతుంది. ఈ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురి కావడం కలకలం రేపుతుంది.

మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు. ఈ కేసుపై గత వారంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ కేసుపై సీబీఐ విచారణకు కూడా తాను సిద్దంగా ఉన్నానని కూడా ప్రకటించారు.
 

click me!