నీ ఉడుత ఊపులకు ఎవరూ భయపడరు: మోదీపై సినీనటుడు శివాజీ ఫైర్

By Nagaraju penumalaFirst Published Feb 11, 2019, 6:55 PM IST
Highlights


చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం కూడా ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో అద్భుతమైన అమరావతి చూస్తామని అభిప్రాయపడ్డారు. 


ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీపై సినీనటుడు శివాజీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లిని సైతం కష్టపెట్టిన ఘనుడు మోదీ అంటూ ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన నోట్ల రద్దు సమయంలో తన తల్లిని సైతం క్యూలో నిలబెట్టిన సంస్కృతి మోదీదేనన్నారు. 

మోదీకి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తెలియవని విమర్శించారు. గో బ్యాక్‌ అంటే గుజరాత్‌ వెళ్లి టీ దుకాణం పెట్టుకోమని అర్థమని శివాజీ ఎద్దేవా చేశారు. మోదీ ఏం చదువుకున్నారో ఎవరికీ తెలియదని శివాజీ వ్యాఖ్యానించారు. 

ఏపీకి కియా మోటార్స్‌ ఇచ్చామని మోదీ అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కు ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని ఆయన సాధిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. 

చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం కూడా ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో అద్భుతమైన అమరావతి చూస్తామని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ఉడుత ఊపులకు భయపడే వారెవరూ ఇక్కడ లేరని సినీనటుడు శివాజీ చెప్పుకొచ్చారు.

click me!