టిడిపి ఎంపీ అశోక్ గజపతిరాజుపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

By Arun Kumar PFirst Published Feb 20, 2019, 8:43 PM IST
Highlights

అంతర్జాతీయ స్థాయిలో తిరుపతి విమానాశ్రయ అభివృద్ది కోసం మాజీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఎంతగానో కృషి చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విమానాశ్రయం కోసం భూమిని అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందన్నారు. ప్రస్తుత కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేష్ ప్రభు, సహాయ మంత్రి జయంత్ సిన్హాలు కూడా తిరుపతి విమానాశ్రయ అభివృద్దికి ఎంతో చొరవ తీసుకున్నారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.  
 

అంతర్జాతీయ స్థాయిలో తిరుపతి విమానాశ్రయ అభివృద్ది కోసం మాజీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఎంతగానో కృషి చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విమానాశ్రయం కోసం భూమిని అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందన్నారు. ప్రస్తుత కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేష్ ప్రభు, సహాయ మంత్రి జయంత్ సిన్హాలు కూడా తిరుపతి విమానాశ్రయ అభివృద్దికి ఎంతో చొరవ తీసుకున్నారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.  

దేశం అభివృద్ది చెందాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీం స్పిరిట్ తో కలిసి పనిచేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. అప్పుడే అభివృద్ది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ పర్యటనలో భాగంగా తిరుపతి విమానాశ్రయ రన్ వే విస్తరణ మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ... తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది తిరుపతికి వస్తుంటారని తెలిపారు. అందువల్ల ఇక్కడి విమానాశ్రయాన్ని అభివృద్ధి పర్చడం ఎంతో ప్రదానమైనదని తెలిపారు. ముఖ్యంగా తిరుపతి లాంటి నగరాల అభివృద్ధి ఆర్థిక పర్యాటక రంగాలకు ఊతమిస్తాయని, దీని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆకాంక్షించారు. విమానయానం అభివృద్ధి పారిశ్రామిక, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి దారి చూపుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.   

కేంద్రప్రభుత్వం దృష్టి సారించిన నగరాల్లో తిరుపతి మొదటి వరుసలో ఉందని  ఉపరాష్ట్రపతి తెలిపారు. దీన్ని స్మార్ట్ సిటీగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నారని, విమానాశ్రయంతో పాటు తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. వీటితో పాటు అనేక కేంద్ర విద్యా సంస్థలు తిరుపతి ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయని, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఈఎస్ఆర్ తో పాటు పాకశాస్త్ర నైపుణ్య (కలనరీ) బోధనా సంస్థ, రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠ్ లాంటి ఎన్నో సంస్థలు తిరుపతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతున్నాయని తెలిపారు.

 గతంతో పోలిస్తే తిరుపతి ఎంతో అభివృద్ధి చెందిందని, స్వచ్ఛత విషయంలో తిరుపతి నగరం అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీ పడుతోందని, ఈ స్ఫూర్తిని ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు. తిరుమల శ్రీనివాసుడు ప్రపంచ వ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్నాడని, పచ్చదనం మరియు పరిశుభ్రత కలిగిన తిరుపతిని సాకారం చేయడం ద్వారా అభివృద్ధికి ఊతమివ్వాలని సూచించారు.

ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని తెలిపిన ఉపరాష్ట్రపతి, అభివృద్ధిలో కనెక్టివిటీది కీలకపాత్ర అని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఉదాన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీ విమానాల సంఖ్య పెంచడం, భారీ రన్ వేల నిర్మాణం,  ప్రయాణికుల సంఖ్య పెరిగేలా చొరవ తీసుకోవడం లాంటివి ముందుకు
సాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర  పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా, చిత్తూరు జడ్పీ ఛైర్ పర్సన్ గీర్వాణి చంద్ర ప్రకాష్, ఇంఛార్జ్ కలెక్టర్ గిరీషా, ఎమ్మెల్సీ గౌణివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు హాజరయ్యారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
 

click me!