తండ్రి అంత్యక్రియలకు వెళ్లకుండా... ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే: వర్ల రామయ్య

By Arun Kumar PFirst Published Apr 20, 2020, 7:06 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా ఎంపీ విజయసాయి రెడ్డి నిబంధనలను ఉళ్లంఘిస్తూ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ తిరుగుతున్నాడని టిడిపి నాయకులు వర్ల రామయ్య మండిపడ్డారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఇష్టమొచ్చినట్లుగా మొరగడం మానుకోకపోతే క్షమించేది లేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హెచ్చరించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి దేశవిదేశీ మేథావులతో చర్చించి కేంద్రానికి, రాష్ట్రానికి అమూల్య సలహాలు ఇస్తున్న చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు.

ఏపీలోను, పొరుగురాష్ట్రాల్లో యధేచ్చగా తిరుగుతున్న విజయసాయి రెడ్డిని క్వారంటైన్లో 14 రోజులు ఉంచాలని వర్ల రామయ్య రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ, విశాఖ,చెన్నై, హైదరాబాద్ లలో రోజుకొకచోట ఆయన దర్శనమిస్తున్నాడని... లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆయనపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తన తండ్రి ఆనంద్ సింగ్ డిల్లీలో చనిపోతే  వెళ్లలేదని గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయడం, విధుల నిర్వహణతో తలమునకలైన కారణంగా ఆదిత్యనాథ్ తన తండ్రి అంత్యక్రియలను బంధువులకు అప్పగించారని పేర్కొన్నారు.  

రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇష్టారాజ్యంగా చక్కర్లు కొట్టడమేమిటని విజయసాయి రెడ్డిని నిలదీశారు. దేశమంతా లాక్ డౌన్ ను తూచా తప్పక పాటిస్తూ క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటే విజయసాయి ఉల్లంఘనకు పాల్పడటం దుర్మార్గమన్నారు. వయస్సు మళ్ళిన వారు రక్తదానం ఇవ్వకూడదన్న  నిబంధనలను సైతం విజయసాయి ఎలా అతిక్రమిస్తారని ప్రశ్నించారు. 

ఎంపీ విజయసాయి రెడ్డిని తక్షణమే క్వారంటైన్ లో 14 రోజులు నిర్బంధించి నెగిటీవ్ అని నిర్ధారణ అయిన తర్వాతే రాష్ట్రంలో తిరగానివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వర్ల రామయ్య సూచించారు.


 

click me!