జగన్ కు వల్లభనేని వంశీ సెగ: యార్లగడ్డ ఇంటి వద్ద ఉద్రిక్తత

By telugu teamFirst Published Oct 26, 2019, 11:04 AM IST
Highlights

వైఎస్ జగన్ తో భేటీ తర్వాత వల్లభనేని వంశీ వైఎస్సార్ సిపీలో చేరుతారనే ప్రచారం ముమ్మరం కావడంతో యార్లగడ్డ వెంకటరావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వంశీని పార్టీలో చేర్చుకోవద్దని యార్లగడ్డ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఆయన ప్రత్యర్థి యార్లగడ్డ వెంకటరావు వర్గీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకటరావు వల్లభనేని వంశీపై పోటీ చేసిన విషయం తెలిసిందే.

వల్లభనేని వంశీ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని జగన్ వంశీకి షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు జగన్ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read: వైసీపీలోకి వల్లభనేని వంశీ: దీపావళీ తర్వాత టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా..?.

వంశీ జగన్ ను కలుస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుక్షణం యార్లగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శనివారంనాడు యార్లగడ్డ నివాసానికి ఆయన అనుచరులు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వంశీని పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.

వంశీని వైఎస్సార్ కాంగ్రెసులో చేర్చుకుంటే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతుందని యార్లగడ్డ ఆందోళన చెందుతున్నారు.  మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీలతో కలిసి వంశీ జగన్ నివాసానికి చేరుకున్నారు. జగన్ తో వంశీ అరగంట పాటు సమావేశమయ్యారు. 

Also Read: జగన్‌తో వంశీ భేటీ ఎఫెక్ట్: అజ్ఙాతంలోకి యార్లగడ్డ వెంకట్రావ్

వంశీ జగన్ ను కలవడానికి ముందు బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కూడా కలిశారు. అయితే, సుజనా చౌదరిని ఆయన మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వార్తలు వచ్చాయి. చివరికి వంశీ వైసిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంశీపై ఇటీవల కేసు నమోదైంది. నకిలీ పట్టాలు ఇచ్చారనే ఆరోపణపై ఆ కేసు నమోదైంది.

click me!