
హనుమాన్జంక్షన్: బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది. ప్రియుడు నూతన్ కుమార్ ఒక్కడే హత్యాయత్నం చేశాడా....లేదా ఇంకెవరైనా ఉన్నారా...హత్యాయత్నానికి కారణాలేంటి... ఆస్తిగొడవలా...లేక భర్తకు దగ్గర అవుతుందనా...అసలు హత్యాయత్నం జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది అన్నప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
బ్యూటీషియన్ పద్మకేషును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ ను వేగవంతం చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మృత్యువుతో పోరాడిన పద్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మంగళవారం పద్మ స్పృహలోకి రావడంతో పోలీసులు కాసేపు ఆమెను విచారించారు. హత్యకు గల కారణాలు..హత్యాయత్నం జరిగిన రాత్రి నూతనకుమార్, పద్మల మధ్య ఏం జరిగిందనే విషయాన్నిరాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు.
హత్యాయత్నానికి సంబంధించి పద్మ పలు కీలక అంశాలను పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తనపై హత్యాయత్నం చేసింది నూతన్ కుమార్ ఒక్కడేనని పద్మ పోలీసులకు తెలిపింది. ఈ నెల 23న రాత్రి పద్మకు నూనత్ కుమార్ కు గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన నూతన్ కుమార్ పద్మను క్రికెట్ బ్యాట్ తో తీవ్రంగా దాడి చేసినట్లు తెలిపింది. తీవ్రంగా కొట్టడంతో ఆ దెబ్బలకు నీరసించి పోయానని....ప్రతిఘటించడానికి కూడా ఓపిక లేదని తెలిపింది. ఆ తర్వాత నూతన్ తన కాళ్లు కట్టేసి, నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి కత్తితో దాడి చేశాడని పద్మ తెలిపింది.
సోమవారం పద్మ రెండు చేతులకు శస్త్రచికిత్స చెయ్యడంతో ఆపరేషన్ నిమిత్తం వైద్యులు అనస్తీషియా ఇచ్చారు. దీంతో కాసేపు విచారణకు సహకరించిన పద్మ ఆ తర్వాత మత్తులోకి జారుకుందని తెలిపారు. అలాగే కత్తిపోట్లతో విపరీతంగా రక్తం పోవటం, మెడపై తీవ్ర గాయం కావటంతో పద్మ ఎక్కువ సేపు మాట్లాడలేకపోయిందని తెలుస్తోంది. స్పృహలోకి వచ్చిన తర్వాత మళ్లీ పోలీసులు విచారించనున్నారు. అయితే నూతనకుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్నిమంగళవారం కుటుంబ సభ్యులు పద్మకు తెలియజేశారు.
మరోవైపు పద్మపై జరిగిన హత్యాయత్నంలో నూతనకుమార్ ఒక్కడే ఉన్నాడని చెప్పింది. దీంతో హత్యాయత్నంలో సుబ్బయ్య అనే మూడో వ్యక్తి ఉన్నట్లు వచ్చిన ఊహాగానాలకు తెరపడ్డట్లైంది. హత్యాయత్నం నూతన్ కుమార్ ఒక్కడే చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నూతనకుమార్, పద్మల మధ్య ఏడాదికాలంగా తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో నూతన్ కుమార్ పై పెదపాడు, హనుమాన్జంక్షన్ పోలీస్ స్టేషన్లలో పద్మ ఫిర్యాదు కూడా చేసింది.
అయితే నూతనకుమార్కు ఏలూరులో ఉన్న ఇల్లును ఇటీవలే విక్రయించాడని ఆ ఇల్లును రూ.35లక్షలకు విక్రయించినట్లు తేలింది. అప్పటి నుంచి నూతన్ పద్మల మధ్య వివాదాలు ఎక్కువ అయ్యాయని తెలిసింది. ఈ 35 లక్షలే వివాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈనెల 23న అంటే హత్యాయత్నం జరిగిన రోజు రాత్రి పద్మ తన భర్త వద్ద ఉంటున్నపెద్ద కుమార్తెకు ఫోన్ చేసి నూతనకుమార్తో కలిసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. భర్త సూర్యనారాయణ సైతం ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. పద్మ కూడా తాము ఆత్మహత్య చేసుకోవాలని భావించామని ఆస్పత్రిలో పోలీసులకు తెలిపింది..ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం చెప్పలేదని తెలుస్తోంది.
ఇద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు.. ఆత్మహత్యకు పద్మ అంగీకరించిందా? లేక నూతనకుమార్ బలవంతం చేశాడా? పద్మను ఆత్మహత్య చేసుకుందామని నమ్మించి ముందుగా మత్తుమందు ఇచ్చి, ఆపై దాడి చేశాడా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలు పద్మ పూర్తిగా కోలుకుంటేగానీ వాస్తవాలు తెలిసే అవకాశం లేదు.