తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం యాప్ను తీసుకొచ్చింది. ‘‘టీటీ దేవస్థానమ్స్’’పేరుతో అభివృద్ది చేసిన ఈ యాప్ గతంలోని గోవింద యాప్కు అప్డేటెడ్ వెర్షన్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం యాప్ను తీసుకొచ్చింది. ‘‘టీటీ దేవస్థానమ్స్’’పేరుతో అభివృద్ది చేసిన ఈ యాప్ను శుక్రవారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ సభ్యులు , ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా స్వామి వారి దర్శనం, గదుల బుకింగ్, ఆర్జిత సేవా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు.. ఈ యాప్లె తిరుమల ఆలయ చరిత్ర, ఎస్వీబీసీ ఛానెల్ కార్యక్రమాలు కూడా వీక్షించవచ్చు. శ్రీవారి భక్తుల కోసం గతంలోనే గోవింద అనే యాప్ తీసుకొచ్చింది టీటీడీ. దీనిని మరింత అభివృద్ధి చేసి ‘‘టీటీ దేవస్థానమ్స్’’ను తీసుకొచ్చారు. గతంలోనే గోవింద యాప్ను డౌన్ లోడ్ చేసుకున్న వారు దీనిని అప్డేట్ చేసుకుంటే కొత్త వెర్షన్లోకి ప్రవేశిస్తారు.
ఇదిలావుండగా..తిరుమల శ్రీవారి ఆలయం డ్రోన్ వీడియోకు సంబంధించిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్కు పర్మిషన్ ఇచ్చింది వాస్తమేనని అన్నారు. కారిడార్ ఏర్పాటు చేసుకునేందుకు అన్నదానం దగ్గర నుంచి గార్బెజ్ సెంటర్ వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్ పర్మిషన్ అడిగితే ఇచ్చామని చెప్పారు. ఆ ప్రాంతంలో మాత్రమే సర్వేకు అనుమతి ఉందన్నారు. అయితే వాళ్లు అత్యుత్సాహంతో ఇది చేశారా? ఎవరైనా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి వీడియోను క్రియేట్ చేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు.
ఆ వీడియోను ఫోరెన్సిక్ డిపార్టమెంట్కు పంపించి ఎలా చేశారనేది గుర్తించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. వైరల్ అయినా వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అని తేలాల్సి ఉందని చెప్పారు. అత్యుత్సాహంతో చేసినా, ఏ విధంగా చేసినా తప్పు తప్పేనని అన్నారు. అయితే అవి ఫేక్ వీడియోలైతే ఏం చేయలేమని అన్నారు. తిరుమల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదని స్పష్టం చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తున్నామని వెల్లడించారు.