
ఆంధ్రప్రదేశ్లో మరో ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. రాష్ట్రంలో అధికార వైసీపీ.. వై నాట్ 175 నినాదంతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై కూడా దృష్టి సారింది. సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురంను కూడా వచ్చే ఎన్నికల్లో తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే హిందూపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్గా టీఎస్ దీపికను నియమిస్తూ వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
దీంతో ఈ అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా హిందూపురం వైసీపీ విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్గా ఉన్న ఇక్బాల్ను.. నవీన్ నిశ్చల్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన ఇక్బాల్ ఓడిపోయారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఇక్బాల్కు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే స్థానిక నాయకులు ఇక్బాల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఇక్బాల్పై హత్య కేసులో ఆరోపణలు రావడం కూడా వైసీపీ కలకలం రేపింది.
ఈ క్రమంలోనే హిందూపురంలో గెలవాలనే లక్ష్యంతో ఉన్న వైసీపీ అధిష్టానం.. అక్కడ పార్టీ నూతన ఇంచార్జ్గా దీపికను నియమించింది. ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్చార్జిల సమీక్షకు దీపిక కూడా హాజరైన సంగతి తెలిసిందే. అయితే దీపిక నియామకం విషయంలో రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెర వెనుక చక్రం తిప్పారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ నియామకంపై ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దీపికను నియమించడంపై స్పందిస్తూ.. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా అనుసరించాల్సిదేనని అన్నారు. అదే సమయంలో పరోక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో హిందుపురం వైసీపీలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే చర్చ మొదలైంది. దీపికను పార్టీ ఇంచార్జ్గా నియమించిన నేపథ్యంలో అక్కడ నుంచి ఆమెనే పోటీకి దింపనున్నట్టుగా తెలుస్తోంది. అయితే టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలకృష్ణను ఓడించడంలో దీపిక విజయవంతం అవుతారా? ఆమెకు పార్టీలోని మిగిలిన వర్గాలు సహకరిస్తాయా? అనేది వేచి చూడాల్సి ఉంది.