తెలంగాణ యువతి కిడ్నాప్ కేసు.. చేధించిన పోలీసులు

Published : Mar 27, 2019, 01:59 PM IST
తెలంగాణ యువతి కిడ్నాప్ కేసు.. చేధించిన పోలీసులు

సారాంశం

మతిస్థిమితంలేని యువతి కిడ్నాప్ కేసును ఏపీ  పోలీసులు ఛేదించారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణకు చెందిన యువతి కిడ్నాప్ కి గురైందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మతిస్థిమితంలేని యువతి కిడ్నాప్ కేసును ఏపీ  పోలీసులు ఛేదించారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణకు చెందిన యువతి కిడ్నాప్ కి గురైందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా యువతిని కాపాడి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

  తిరుమల ఏఎస్పీ మహేశ్వరరాజు కథనం..తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడెం గాంధీనగర్‌కు చెందిన కె.ధనలక్ష్మి(23) కుటుంబ సభ్యులతో ఈనెల 9న తిరుమలకు వచ్చారు. అయితే  పీఏసీ–1లో నిద్రిస్తుండగా ఆమె వేకువజామున 1.37 గంటలకు అదృశ్యమైంది. 

ఇది గుర్తించిన ఆమె సోదరుడు దుర్గాప్రసాద్‌ ఉదయం టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సోదరికి మతిస్థిమితం లేదని ఎవరైనా తీసుకుపోతే వారి వెంటే వెళుతుందని, భోజనం పెడితే తింటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పీఏసీ–1 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. 

ధనలక్ష్మిని నిద్ర లేపి చేయి పట్టుకుని ఓ వ్యక్తి తీసుకెళ్లడం, అక్కడ నుంచి కమాండర్‌ జీపులో తీరుపతికి తీసుకెళ్లే దృశ్యాలు రికార్డు అయి ఉండటంతో క్లూ లభించినట్లైంది.  తిరుపతి రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ రికార్డులను పరిశీలిస్తే వేకువజామున 2.43 గంటలకు రైలు ఎక్కి చెన్నైకు వెళ్లినట్లు గుర్తించారు. 

నిందితుడు తిరుమలకు వచ్చినప్పుడు అతను తన వెంట తెచ్చిన బ్యాగు తిరుగు ప్రయాణంలో లేకపోవడాన్ని గమనించారు. పీఏసీ–1 లో ఆ బ్యాగ్‌ను అతను వదిలిపెట్టి వెళ్లడంతో నిందితుడి వివరాలు ఇట్టే తెలుసుకోగలిగారు.  నిందితుడిని అరెస్టు చేశారు. ధనలక్ష్మిని పెళ్లి చేసుకునేందుకు తీసుకెళ్లి, ఆమెకు మతిస్థిమితం లేదని గ్రహించాక అర్జున్‌దాస్‌ ఆమెను చెన్నై ఎగ్మూర్‌ స్టేషన్‌లో విడిచి పెట్టినట్లు విచారణలో తేలింది.

 రైల్వే పోలీసులు ఆమెను ఒక హోమ్‌లో చేర్చినట్లు తెలుసుకున్నారు. ఆ హోమ్‌ నుంచి ధనలక్ష్మిని తీసుకొచ్చిన పోలీసులు సోమవారం సాయంత్రం ఆమె తల్లిదండ్రులకు అప్పటించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి  రిమాండ్‌కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu