
Balakrishna: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. నారా లోకేశ్ పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల మధ్య విజయవంతంగా కొనసాగిందని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని.. వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం, ఇబ్బందులను గుర్తు పెట్టుకోవాలని అన్నారు. 1982లో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు కులాలు,మతాలు,వర్గాలకు అతీతంగా విశేష స్పందన వచ్చిందనీ, అదేవిధంగా నేడు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అంతటి విశేష స్పందన వచ్చిందని అన్నారు. యువనేతపై ఈగ వాలకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కాపాడుకుంటూ వచ్చారన్నారు. యువనేతకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సినిమాకే కాకుండా ప్రజాసమస్యలపై పోరాటానికి అధికంగా కేటాయిస్తున్నారనీ, రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ తిరుగులేని పోరాటం చేశారని ప్రశంసించారు. చంద్రబాబు తన విజన్ తో ఐటీ, డ్వాక్రాను తీసుకొచ్చారనీ, ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు కొనసాగించి పేదలకు అండగా నిలిచారని తెలిపారు. ప్రపంచ దేశాలకు చంద్రబాబు తన విజన్ ను పరిచయం చేశారనీ, కానీ.. సీఎం జగన్ మాత్రం రాష్ట్రానికి హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, కూల్చివేతలను పరిచయం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాభివృద్ధిని జగన్ నిర్వీర్యం చేశారనీ, దాదాపు రూ.10లక్షల కోట్ల అప్పు చేశాడని మండిపడ్డారు. సీఎం జగన్ అరాచకపాలనలో ధరలు, పన్నులు, రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయనీ, సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకమైందని మండిపడ్డారు. జగన్ ల్యాండ్, శాండ్, మైన్ స్కాములతో దోచుకుంటున్నాడనీ, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారనీ, ఏపీకి రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రజలపై అక్రమ కేసులతో బెదిరిస్తున్నాడనీ, పోలీసులు,ఉద్యోగులు, కార్మికులను వేధిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తే.. జగన్ నిర్లక్ష్యంతో నేడు అందులో పందులు, కుక్కలు తిరిగేలా పాడుబెట్టిపోయిందని ఆరోపించారు.
సీఎం జగన్ తన పాలనలో ఒక్క రోడ్డు వేయలేదనీ, కనీసం ఒక్క గుంత కూడా పూడ్చలేదని విమర్శించారు. సీఎం కుర్చీలో జగన్ కనకపు సింహాసనంపై శునకం మాదిరి ప్రవర్తిస్తున్నాడనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రపంచ పటంలో ఏపీ ఉండదనీ, ఇది తథ్యమని ఎద్దేవా చేశారు. సమయం లేదు మిత్రమా.. వచ్చే ఎన్నికల్లో విజయమా? వీరస్వర్గమా? అనేది రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలని పేర్కొన్నారు. సొంత సామాజికవర్గాన్ని స్థానాల నుండి మార్చకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రమే ఓడిపోయే స్థానాల్లోకి పంపుతున్నాడనీ, ఇందులో ఎక్కడా సామాజిక న్యాయం ఉందని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలపై కపట ప్రేమ, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, ఆయనను నమ్మె పరిస్థితిలో ఎవరూ లేరని అన్నారు. కప్ప బావి మాత్రమే తన ప్రపంచం అని భావించినట్లు, సీఎం జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ ను లోకమని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రజలంతా నడుం బిగించాలనీ, ఎవడు అడ్డొస్తాడో మేం చూస్తామనీ, మీరు ముందడుగు వేయండని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపు నిచ్చారు.