అలాంటి వారిని చూసిన దేశంలో ఇలాంటి స్పీకరా..: తమ్మినేనిపై ఎమ్మెల్సీల ఆగ్రహం

By Arun Kumar PFirst Published Jul 2, 2020, 8:35 PM IST
Highlights

శాసనమండలి వ్యవహారాల్లో స్పీకర్ జోక్యం సరి కాదని...రాజ్యాంగ బద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం స్పీకర్ గా కొనసాగే అర్హత లేదని టిడిపి ఎమ్మెల్సీలు ఆరోపించారు. 

గుంటూరు: శాసనమండలి వ్యవహారాల్లో స్పీకర్ జోక్యం సరి కాదని...రాజ్యాంగ బద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం స్పీకర్ గా కొనసాగే అర్హత లేదని టిడిపి ఎమ్మెల్సీలు ఆరోపించారు. మండలి వ్యవహారాలు, జ్యుడిషియల్ వ్యవస్థపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ టిడిపి ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర యాదవ్, గౌరివాని శ్రీనివాసులు, బిటి నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. 

''రాజకీయాలే ముఖ్యం అని భావిస్తే స్పీకర్ పదవికి రాజీనామా చేసి మాట్లాడుకోవాలి. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తులను చూసిన ఈ ప్రజాస్వామ్య దేశంలో...స్పీకర్ గా ఉండి రాజకీయాలు మాట్లాడిన వ్యక్తిని చూస్తామని అనుకోలేదు'' అని ఎద్దేవా చేశారు. 

read more  కోర్టు దిక్కరణ... అదీ శ్రీవారి సన్నిధిలో...: స్పీకర్ తమ్మినేనిపై వర్ల ధ్వజం

''శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండా మంత్రులే అడ్డుకున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత ఇతర బిల్లులు పెట్టమని టిడిపి సభ్యులు కోరితే అమరావతి, మూడు రాజధానులు బిల్లులపై పట్టుపట్టారు. ఇదంతా తెలిసి కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం శాసన మండలిలో సభ్యుల కారణంగానే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదని వ్యాఖ్యానించడం దుర్మార్గం'' అని అన్నారు. 

''ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యంలో చట్ట సభలు, సభ్యులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాలని తమ్మినేని గుర్తుంచుకోవాలి'' అని టిడిపి శాసన మండలి సభ్యులు పేర్కొన్నారు. 
 

click me!