అంచనాలు పెంచుకోవడమే తప్ప పోలవరంప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశ్యం వైసిపి ప్రభుత్వానికి లేదని టిడిపి ఎమ్మెల్యే అనగాని ఆరోపించారు.
అమరావతి: గతంలో టిడిపి ప్రభుత్వ పట్టుదలకు, నిబద్ధతకు, చిత్తశుద్దికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం అద్దం పట్టిందడితే... ఈనాడు కాంట్రాక్టర్లు, కమిషనర్లపై శ్రద్దకు ఈనాడు అద్దం పడుతోందని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. అంచనాలు పెంచుకోవడం తప్ప ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశ్యం వైసిపి ప్రభుత్వానికి లేదని అనగాని ఆరోపించారు.
''దేశంలో అత్యంత పెద్ద ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటి... కానీ పనులు చేస్తే రెండేళ్లల్లో కేవలం 0.89 శాతం మాత్రమే జరిగాయి. వ్యయం, అంచనాలు మాత్రం అమాంతంగా రూ.3,222 కోట్లు పెరిగింది. ఇది జాతీయ ప్రాజెక్టు పోలవరానికి పట్టిన గ్రహణం. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని మెఘాకు అప్పగించి మూడు నెలల్లోనే ఇసుక ధరల పేరుతో రూ.500 కోట్లు దోచిపెట్టారు. ఇప్పుడు మరో 1600 కోట్లు దోచిపెట్టేందుకు సిద్దపడ్డారు. మొత్తం మీద రూ.2,100 కోట్లు ప్రజాధనం దోపిడీకి కుట్ర పన్నారు'' అని అనగాని ఆరోపించారు.
''కాంట్రాక్టర్లు, కమీషన్లపై చూపుతున్న శ్రద్ధ రైతు ప్రయోజనాలపై చూపడం లేదు. జగన్ రెడ్డి అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పోలవరాన్ని తన ఆదాయానికి కల్పవృక్షంగా మార్చుకున్నారు గాని ప్రాజెక్టు పూర్తి మాత్రం గాలికి వదిలేశారు. పోలవరాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవాలన్న ద్యాసలో కొంతైనా ప్రాజెక్టు పూర్తి మీద పెట్టి ఉంటే బాగుండేది. ఇప్పుడు కూడా కేవలం దోచుకునేందుకే అంచనాలు పెంచుకున్నారని అర్ధమవుతుంది'' అన్నారు.
read more రెండేళ్ల తర్వాత అంతా మనదే... వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..: లోకేష్ హెచ్చరిక
''ఇప్పటికే పోలవరం అప్పుడు పూర్తి అవుతుంది, ఇప్పుడు పూర్తి అవుతుందని ఆరంభ సూరత్వం పలికిన జగన్ రెడ్డి 2022 జూన్ నాటికి కూడా కష్టమే అవుతుందని మరో సారి మాట మార్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఎటూ ఆయన మడమ తిప్పడం, మాట మార్చడం పూర్తిగా అలవాటై పోయింది'' అని విమర్శించారు.
''తెలుగుదేశం హయాంలో పోలవరం అంచనాలు దోచుకునేందుకు పెంచుకున్నారని ఊదరగొట్టిన జగన్ అండ్ కో భజన గనం నేడు ఏం చెబుతారు? రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులను నీరుగార్చారు. ఒక్క ప్రాజెక్టుకు రెండేళ్లల్లో తట్ట మట్టి ఎత్తలేదు, బొచ్చ కాంక్రీట్ వేయలేదు. జలవనరుల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అభివృద్ధిని అటకెక్కించిన జగన్ రెడ్డి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు'' అని టిడిపి ఎమ్మెల్యే అనగాని ఆరోపించారు.