
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (ap assembly budget session ) సందర్భంగా ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు (konijeti rosaiah) సంతాపం తెలుపకపోవడంపై టీడీపీ నేత (tdp) , మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (nakka anand babu) మండిపడ్డారు. రోశయ్య పట్ల జగన్ రెడ్డి (ys jagan) సర్కారు అనుసరించిన విధానం అత్యంత దుర్మార్గమన్నారు. రాజకీయ కురువృద్ధుడిగా పేరొందిన వ్యక్తి మరణిస్తే.. ముఖ్యమంత్రిగా కనీసం సంతాపం తెలపకపోవడం జగన్ రెడ్డి కుసంస్కారానికి నిదర్శనమని ఆనందబాబు ఎద్దేవా చేశారు. తండ్రి శవం దొరక్క ముందే.. ముఖ్యమంత్రి పదవి కోసం చేసిన కుతంత్రాలకు తలొగ్గలేదనే అక్కసుతోనే రోశయ్యను అవమానించారని ఆయన ఆరోపించారు.
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఒక జిల్లాకు కొణిజేటి రోశయ్య పేరు పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా.. ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం మీ అహంకారానికి నిదర్శనమంటూ ఆనందబాబు ఫైరయ్యారు. ప్రతిపక్షాలపై బురద జల్లడానికి, వ్యక్తిగత హననానికి చట్ట సభల సమయాన్ని జగన్ రెడ్డి కేటాయిస్తున్నారు దుయ్యబట్టారు. ప్రజానాయకుడి మృతికి సంతాపం తెలిపేందుకు సమయం లేకపోయిందా.? మీ అహంకార పూరిత నిర్ణయాలే.. మిమ్మల్ని పాతాళానికి దిగజార్చుతాయని గుర్తుంచుకోవాలని ఆనందబాబు హితవు పలికారు. అసెంబ్లీలో గీతలు గీసి.. ఆ గీతలు దాటితే ప్రతిపక్షాలను సస్పెండ్ చేస్తామంటున్న వైసీపీ నేతల తలరాతలు మార్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.
అంతకుముందు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (mekapati goutham reddy) మృతిపై మంగళవారం ప్రభుత్వం తరఫున సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా పలువురు సభ్యులు గౌతమ్ రెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడిన సీఎం జగన్.. గౌతమ్రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. తన సహచరుడు, మిత్రుడు గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. చాలా సందర్భాల్లో గౌతమ్రెడ్డి తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. వయస్సులో తన కన్నా ఒక్క సంవత్సరం పెద్దవాడైనా తనను అన్న అని గౌతమ్రెడ్డి ఆప్యాయంగా పిలిచేవారని సీఎం జగన్ గుర్తుచేసుకున్నారు. యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీలో గౌతమ్రెడ్డి ఉన్నత చదువులు చదివారని తెలిపారు.
తాను సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ (congress) నుంచి బయటకు వచ్చినప్పుడు తనతో పాటు గౌతమ్ నిలబడ్డారని.. ఆయన నిలబడటమే కాకుండా అతని తండ్రిని కూడా తనతో నడిపించారని జగన్ గుర్తుచేశారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. పారిశ్రామిక మంత్రిగా గౌతమ్రెడ్డి చాలా కృషి చేశారని తెలిపారు. గౌతమ్ రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలను నెరవేరుస్తామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి (sangam barrage) మేకపాటి గౌతమ్రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామని తెలిపారు. అనంతరం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి.