ఇప్పటికైనా విజయమ్మ తన కళ్లకున్న గంతలు తీసేసి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలని టిడిపి నాయకులు అయ్యన్నపాత్రుడు సూచించారు.
విశాఖపట్నం: అబద్ధాలాడటంలో వైఎస్ కుటుంబాన్ని మించిన వారు ప్రపంచంలోనే లేరని విజయమ్మ లేఖతో మరోసారి తేలిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు మరియు మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విజయమ్మ తన కళ్లకున్న గంతలు తీసేసి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలని సూచించారు.
''వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ విచారణ కావాలని, తరువాత ఎందుకు వద్దన్నాడో రాజమాత తనబిడ్డను ప్రశ్నించాలి. వైఎస్ చనిపోయినప్పుడు తండ్రిలేని బిడ్డను ఆదరించాలని విజయమ్మ కోరింది.మరిప్పుడు తండ్రిని కోల్పోయి తనకు న్యాయం జరగడం లేదంటున్న సునీతకు విజయమ్మ ఏం సమాధానం చెబుతుంది?'' అని అయ్యన్న నిలదీశారు.
read more నేటితరం గాంధారి విజయమ్మ... తాడేపల్లి దుర్యోధనుడిలా జగన్: పట్టాభిరాం సంచలనం
''రాజశేఖర్ రెడ్డిని రిలయన్స్ వారే చంపారని ఆ సంస్థ ఆస్తులు తగలబెట్టించిన జగన్ తిరిగి వారికే సన్మానాలు, సత్కారాలు చేయడమేంటి? రిలయన్స్ అధినేత చెప్పిన వ్యక్తిని రాజ్యసభకు పంపడమేంటి? తన కొడుకు అవసరార్థం సాగిస్తున్న కుటిల రాజకీయాల గురించి ప్రశ్నించాల్సిన బాధ్యత రాజమాతపై లేదా?'' అని ప్రశ్నించారు.
''వివేకా డైరీని స్థానిక పోలీసులు సీబీఐకి ఎందుకివ్వడం లేదో విజయమ్మ స్పష్టం చేయాలి. జగన్ కు దెబ్బతగిలిన ప్రతిసారి విజయమ్మ బయటకువస్తుంది. అలావచ్చే కుటుంబసభ్యులంతా కలిసి రాష్ట్రాన్ని ఈస్థితికి చేర్చారు.ఆంధ్రాని జగన్, తెలంగాణను షర్మిల తీసుకున్నట్లే, విజయమ్మ తమిళనాడు, భారతి కర్ణాటకను పంచుకుంటారేమో?తనకొడుక్కి బుద్ధిచెప్పి, రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత విజయమ్మపైనే ఉంది'' అని అయ్యన్న హెచ్చరించారు.