ఆ అమరజవాన్ కుటుంబాన్ని ఆదుకోండి..: సీఎస్ కు చంద్రబాబు లేఖ

By Arun Kumar PFirst Published Jul 13, 2021, 5:02 PM IST
Highlights

గతేడాది దేశ రక్షణ కోసం ప్రాణాలను సమర్పించిన వీర‌జ‌వాన్ లావేటి ఉమామ‌హేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని ఆదుకోవాలని జగన్ సర్కార్ ను కోరారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. 

అమరావతి: దేశ రక్షణ కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన వీర‌జ‌వాన్ లావేటి ఉమామ‌హేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని ఆదుకోవాలని జగన్ సర్కార్ ను కోరారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. భారత సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేస్తూ వీరమరణం పొందిన శ్రీకాకుళం వాసి ఉమమహేశ్వరరావు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాధ్ దాస్  చంద్రబాబు లేఖ రాశారు. 

''మన జీవితాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించడం మన కర్తవ్యం. అలాంటి వారిలో శ్రీకాకుళం నుంచి భారత సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేసిన లావేటి ఉమమహేశ్వరరావు ఒకరు. ఆయన భారత సైన్యంలో 17 సంవత్సరాలు పనిచేశారు. 2020 జూలై 18న లడఖ్ లోని బటాలిక్ సెక్టార్ లో బాంబు నిర్వీర్యం చేస్తుండగా చనిపోయారు'' అని తెలిపారు.

read more  ఎవ్వరినీ వదిలిపెట్టం... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే..: వైసిపి నాయకులకు చంద్రబాబు వార్నింగ్

''వీరమరణం పొందిన ఉమామహేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. ఈ వీరజవాన్ కుటుంబానికి ఆర్థిక సహాయం మంజూరు చేయడంలో ఆలస్యం జరిగినందుకు సమిష్టిగా మనమందరం సిగ్గుపడాలి'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''ఉమమహేశ్వరరావు వంటి ధైర్యసాహసాలు గల సైనికులు చేసిన త్యాగాల వల్లే మనం నిర్భయంగా జీవిసస్తున్నామని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన కుటుంబానికి అత్యవసర ప్రాతిపదికన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని చంద్రబాబు సీఎస్ ను కోరారు.

click me!