దద్దమ్మల్లారా... అభివృద్ధి చేస్తామంటే ఎవరొద్దన్నారు : వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు కౌంటర్

By Siva KodatiFirst Published Sep 27, 2022, 5:35 PM IST
Highlights

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్రలోని భూములను కొట్టేయడానికి నాటకాలు ఆడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రను అడ్డుకోవడానికి రాష్ట్రమేమైనా నీ జాగీరా అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వారి హక్కుల కోసం పాదయాత్రలు చేస్తుంటే మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయొద్దా అని వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారని.. దద్దమ్మల్లారా డెవలప్‌ చేస్తానంటే వద్దంటామా అని ఆయన నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మూడు రాజధానులు అంటున్నారని.. ఈ మూడేళ్లలో ఉత్తరాంధ్రకు వైసీపీ చేసిందేమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రుషికొండను కాజేస్తున్నారని.. ఉత్తరాంధ్రలోని భూములను కొట్టేయడానికి నాటకాలు ఆడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

కాగా.. అంతకుముందు ఆదివారం వైసీపీ ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో నిర్వహించిన పాలనా వికేంద్రీకరణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం  రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని మరో ఐదేళ్లు తమ ప్రభుత్వం పొడిగించిందని మంత్రి తెలిపారు.అమరావతి పేరుతో చంద్రబాబు సర్కార్ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు.  

ALso Read:ఓవైపు అమరావతి నిబంధనల సవరణ.. మరోవైపు న్యాయపోరాటం: మూడు రాజధానుల కోసం జగన్ భారీ కౌంటర్ ప్లాన్

వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ది జరుగుతుందని  ఆయన చెప్పారు.  మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని బొత్స గుర్తు చేశారు. అందరి అభిప్రాయాలు తెలుసుకొనే మూడు రాజధానులనే నిర్ణయం చెప్పామన్నారు. ఎవరినీ కించపర్చాలనే ఉద్దేశ్యంతో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని.. అమరావతిలోని 29 గ్రామాల సమస్యను రాష్ట్రం మొత్తం రుద్దడం దుర్మార్గమన్నారు. మంత్రిగా తనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు  సమానమేనని... కానీ పుట్టిన ప్రాంతమంటే మమకారం ఎక్కువ అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కానీ రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ది చెందాలని కోరుకోవడం ధర్మంగా ఆయన పేర్కొన్నారు. అలా చేయనిపక్షంలో మంత్రి పదవికి తాను అర్హుడిని కానన్నారు. 
 

click me!