ముక్కోటి ఏకాదశి: తిరుమల ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Siva Kodati |  
Published : Dec 22, 2020, 04:00 PM IST
ముక్కోటి ఏకాదశి: తిరుమల ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సారాంశం

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6 నుండి 12 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. 

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6 నుండి 12 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.

ఈ సమయంలో స్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.  

అనంతరం స్వామి వారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వ దర్శనానికి అనుమతించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ అద‌న‌పు ఈవో ఏవీ.ధ‌ర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తి ఏడాదీ సంవ‌త్స‌రానికి నాలుగు సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

దీనిలో భాగంగా ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పై కప్పుతో పాటు పూజా సామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌ రెడ్డి, శ్రీ అనంత‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్ర నాథ్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli