అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తైన తర్వాతే హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది.
హైదరాబాద్: అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తైన తర్వాతే హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. డిసెంబర్ 15లోగా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టకు స్పష్టం చేసింది.
న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైందని ఏపీ తరపు న్యాయవాది నారీమన్ వెల్లడించారు. కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై రెండ్రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది.
హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణం డిసెంబరు 15లోగా పూర్తవుతుందని ఆతర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నారీమన్ ఇదే విషయాన్ని సోమవారం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్ ఏపీ ప్రభుత్వం అంత స్పష్టంగా చెబుతున్నందున భవన నిర్మాణాలకు సంబంధించి ఫోటోలను న్యాయస్థానానికి అందజేయాలని కోరారు. ఇరువాదనలు విన్న సుప్రీంకోర్టు అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణం పూర్తైన తర్వాతే హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని కేంద్రాన్ని ఆదేశించింది.