టీచర్లతో వైన్ షాప్ డ్యూటీలా: ఏపీలో మద్యం అమ్మకాలపై పవన్ కల్యాణ్

By telugu teamFirst Published May 5, 2020, 2:30 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. వైన్ షాపుల వద్ద ఉపాధ్యాయులతో విధులు చేయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ: లాక్ డౌన్ సడలింపుల తరవాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం దుకాణాల దగ్గర గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను వినియోగించుకోవడం శోచనీయమని, బాధాకరమని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు చెప్పే గురువులకు ఇవేం విధులని అడిగారు. ప్రభుత్వం బాధ్యతను విస్మరించి గురువులకు ఇలాంటి పనులు అప్పగిస్తుందా అని ప్రశ్నించారు. 

కరోనా విధులకు వారిని ఉపయోగించుకోవాలంటే పేదలకు ఆహారం, నిత్యావసరాలు అందుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకో, ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకో వినియోగించుకోవాలని సూచించారు. ఇంతకాలంపాటు పాటించిన లాక్ డౌన్ నియమాలను, ఆ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి మంటగలిపేసింది అన్నారు. అన్ని వర్గాల ప్రజలు వ్యక్తిగత దూరం పాటించాలనే ఉద్దేశంతో దేవాలయాలకీ, మసీదులకు, చర్చిలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే- ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలను తెరిచి వ్యక్తిగత దూరం అనే నియమాన్ని తుంగలో తొక్కేసింది అని చెప్పారు. 

మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ గారు టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించి జిల్లాలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కరోనా వ్యాప్తిలో చిత్తూరు జిల్లా రెడ్ జోన్ లో ఉండటం, శ్రీకాళహస్తిలో వ్యాధి వ్యాప్తి, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు, రైతాంగం, నేత కార్మికుల సమస్యలు, నీటి ఎద్దడి సమస్యలను నాయకులు వివరించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ .. "హిందువులు శ్రీరామ నవమి, ఉగాది, క్రైస్తవులు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ గడప దాటకుండా చేసుకున్నారు... ఇప్పుడు ముస్లింలు రంజాన్ మాసం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకొంటున్నారు... ప్రజలు కరోనా నియంత్రణ కోసం ఎంతో నియమబద్ధంగా ఉంటుంటే ప్రభుత్వం మాత్రం బాధ్యతను విస్మరించింది. లాక్ డౌన్ కి సడలింపులు ఇవ్వగానే మద్యం అమ్మకాలను చేపట్టడం సరికాదు" అని ఆయన అన్నారు. 

"సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు కరోనా వ్యాప్తి ఉన్న విపత్కర సమయంలో దుకాణాలు తెరవడం ఏమిటి? ఆరోగ్యపరమైన విపత్తు ఉన్న సమయంలో కూడా మద్యం అమ్మకాలు ఆపలేరా? కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి తీసుకురావడం ఎంతో కష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. అయినా వీరికి అర్థం కావడం లేదు" అని పవన్ కల్యాణ్ అనన్ారు. . 

అభివృద్ధిలో కాదు కరోనా కేసుల్లో ముందుకు వెళ్తోంది 

"శ్రీకాళహస్తి లాంటి చోట్ల ప్రజా ప్రతినిధులు చేసిన ర్యాలీలు, బహిరంగ కార్యక్రమాలు వారెంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారో వెల్లడిస్తున్నాయి. జాతీయ స్థాయి నాయకులతో నిన్ననే రాష్ట్రంలో పరిస్థితిపై మాట్లాడాను" అని పవన్ కల్యాణ్ చెప్పారు. "మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా చేయడం, ఆ దుకాణాల దగ్గర జనం వేలంవెర్రిగా ఉన్నా కట్టడి చేయకుండా వదిలేయడం, ప్రజా ప్రతినిధులు ర్యాలీలు చేయడం గురించి వారు ప్రస్తావించి ‘ఆంధ్ర ప్రదేశ్ కరోనా ఫ్రెండ్లీ స్టేట్’ అని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు" అని ఆయన అన్నారు. 

" మన వైపు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం గోడ కట్టేసింది... ఇక్కడ కరోనా తీవ్రత చూసి. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేంద్ర గారు తాము జాగ్రత్తలు తీసుకోకపోతే కర్నూలు, గుంటూరుల్లా అయ్యేది అన్నారు. గోడ కట్టడం, పొరుగు రాష్ట్రాల మంత్రులు మనల్ని ఉదహరించడం చూస్తే.. మన రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా కట్టడిపై చిత్తశుద్ధి లేదని వెల్లడవుతోంది" అని ఆయన అన్నారు. 

"ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో కాదు కరోనా కేసుల్లో ముందుకు వెళ్తోంది.కరోనా నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితుల వల్ల చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా చితికిపోయారు. వారికి ఉపశమనం కలిగేలా ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. టీటీడీలో 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను తొలగించారని మన నాయకులు తెలపగానే స్పందించాను" అని పవన్ కల్యాణ్ చెప్పారు. 

"ఆధిపత్యపు పోరుకు చిన్నపాటి జీతాలతో పనిచేసేవారిని బలి చేయడం భావ్యం కాదు. ఈ జిల్లాలో రైతాంగం పడుతున్న బాధలు నా దృష్టికి చేరాయి. మామిడి, టమోటా రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రధానంగా ఉద్యాన పంటలు వేసినవారు ఎంతగా నష్టపోయారో సమగ్ర నివేదిక ద్వారా కేంద్రానికి తెలియచేస్తాను" అని చెప్పారు. 

"చేనేత కార్మికులు, చిన్నపాటి పరిశ్రమలు నిర్వహించేవారు ఆర్థికంగా దెబ్బ తిన్నారు. వీరందరిపై ప్రభుత్వం సానుభూతి చూపాలి. చిత్తూరు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న విషయం నా దృష్టికి చేరింది. చిత్తూరు, మదనపల్లి ప్రాంతాల్లో రోజూ 2 వేల ట్యాంకర్లు సరఫరా చేయాల్సి ఉంటే కనీసం 800 కూడా సరఫరా చేయలేకపోతున్నారు.  ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణ స్పందించాలి" అని పవన్ అన్నారు.

click me!