జీర్ణించుకోలేనిది: వాజ్ పేయి మృతికి పవన్ కల్యాణ్ సంతాపం

By pratap reddyFirst Published Aug 16, 2018, 7:41 PM IST
Highlights

మహానేత అటల్ బిహార్ వాజ్ పేయి మృతికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. వాజ్ పేయి మహాభి నిష్క్రమణ భారతదేశానికి తీరని లోటు అని, ఆయన మధ్య ఇక ఉండరన్న విషయం జీర్ణించుకోవడం సాధ్యం కానిదని అన్నారు. 

హైదరాబాద్: మహానేత అటల్ బిహార్ వాజ్ పేయి మృతికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. వాజ్ పేయి మహాభి నిష్క్రమణ భారతదేశానికి తీరని లోటు అని, ఆయన మధ్య ఇక ఉండరన్న విషయం జీర్ణించుకోవడం సాధ్యం కానిదని అన్నారు. 

వాజ్ పేయి మృతి యావత్ జాతితో పాటు తాను కూడా దు:ఖిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాజ్ పేయి ఓ వ్యక్తి కాదు.. శక్తి అని, ప్రధాన మంత్రిగా మన దేశానికి సాధించి పెట్టిన విజయాలు సర్వదా కీర్తించదగినవని అన్నారు. 

భారతదేశాన్ని అణుశక్తి దేశంగా ఆవిష్కరించడానికి ఆయన చూపిన వజ్ర సంకల్పం దేశ రక్షణకు కవచంగా మారిందని పవన్ అన్నారు. శత్రువులు మనవైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేలా చేసిందని అన్నారు. 

వాజ్ పేయి హయాంలో మన దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిందని, విలువలతో కూడిన వాజ్ పేయి రాజకీయం ఈనాటి రాజకీయ నాయకులకు సర్వదా ఆచరణీయమని అన్నారు. 

నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు సాక్,్యం ఆయన పవన్ అన్నారు. వాజ్ పేయి రాజకీయ జీవిత ప్రయాణంలో కాంతులీనే కోణాలు ఎన్నో... మేలి మలుపులు మరెన్నో అని అన్నారు. బహు భాషా కోవిదుడైన వాజ్ పేయి ప్రసంగాలు రాజనీతి మేళవింపుగా ఎంతో సేపు విన్నా వినాలనిపించేలా ఉంటాయని ఆయన అన్నారు. 

కవిగా, రచయితగా ఆయన మనకు పంచిన కవితా సౌరభావలు చిరంతనంగా పరిమళిస్తూనే ఉంటాయని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భారత మాత ముద్దు బిడ్డగా పుట్టడం మన జాతి అదృష్టమని పవన్ అన్నారు. 

ఈ పుణ్యభూమికి ప్రధాన మంత్రిగా సేవలందించడం మన భాగ్యమని, రాజకీయ భీష్మునిగా కీర్తిని అందుకున్న వాజ్ పేయి చిరస్మరణీయుడని , భరత జాతి ఎంతో రుణపడి ఉందని ఆయన అన్నారు. 

click me!