
విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపొద్దని సంబంధిత అధికారులను ఆదేశించింది. రిషికొండలో చేపడుతున్న నిర్మాణలపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై మరోసారి విచారణ జరిపిన ఎన్జీటీ ఈ ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకు జరిగిన తవ్వకాలపై వ్వకాలపై అధ్యయనం చేసేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని తెలిపింది. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ తన ఆదేశాల్లో పేర్కొంది.
కొండపై నిర్మాణ పనులు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా.. ఎన్జీటీ ఈ కేసును మే 6న విచారణ జరిపిందని.. బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇక, గతేడాది ఎన్జీటీ చైర్మన్కు ఆదర్శకుమార్ గోయల్కు లేఖ రాసిన రఘురామ కృష్ణరాజు.. విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఏపీ పర్యాటక శాఖ, పట్టణ మున్సిపల్ శాఖ అమలులో ఉన్న పర్యావరణ అనుమతులు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వీటిపై వెంటనే విచారణ చేపట్టి.. పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.