నగరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 26, 2024, 9:48 PM IST
Highlights

నగరి అంటే రోజా.. రోజా అంటే నగరి అన్నంతగా చెరగని ముద్ర వేశారు. సినీనటిగా తన గ్లామర్‌కు తోడు, వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు రోజా. కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్రులు ఒకసారి నగరిలో విజయం సాధించారు. పుత్తూరులో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరిలో ఆరో విజయం అందుకున్నారు. అలాగే నగరిలో కాంగ్రెస్ నేత రెడ్డివారి చెంగారెడ్డి ఐదు సార్లు గెలిచారు. నగరిలో వైసీపీ జైత్రయాత్రను కొనసాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే రోజాకు స్థానిక నేతల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు. 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి చెప్పగానే.. మంత్రి రోజానే గుర్తొస్తారు. సినీనటిగా తన గ్లామర్‌కు తోడు, వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు రోజా. నగరి అంటే రోజా.. రోజా అంటే నగరి అన్నంతగా చెరగని ముద్ర వేశారు. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్రులు ఒకసారి నగరిలో విజయం సాధించారు. ఈ సెగ్మెంట్ పరిధిలో నింద్రా, విజయాపుపరం, నగరి, పుత్తూరు, వడమాలపేట మండలాలున్నాయి. 

నగరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్‌కు కంచుకోట :

2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పుత్తూరు నియోజకవర్గం రద్దయి వడమాల, పుత్తూరు మండలాలు నగరి పరిధిలోకి వచ్చాయి. పుత్తూరులో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరిలో ఆరో విజయం అందుకున్నారు. అలాగే నగరిలో కాంగ్రెస్ నేత రెడ్డివారి చెంగారెడ్డి ఐదు సార్లు గెలిచారు. 2014లో సినీనటి రోజా వైసీపీ అభ్యర్ధిగా తొలుత విజయం సాధించారు. ఆ తర్వాతి నుంచి నగరిని ఆమె తన అడ్డాగా చేసుకున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు 80,333 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాష్‌కు 77,625 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రోజా 1352 ఓట్ల తేడాతో వరుసగా రెండో విజయం అందుకుని వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు.

నగరి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై రోజా కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. నగరిలో వైసీపీ జైత్రయాత్రను కొనసాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే రోజాకు స్థానిక నేతల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కేజే కుమార్, కేజే శాంతి, రెడ్డివారి చక్రపాణి రెడ్డి తదితరులు రోజాపై రగిలిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రోజాకు అసలు టికెట్ వస్తుందా , రాదా అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే ఎట్టకేలకు ఆమెపై నమ్మకం వుంచిన జగన్ మరోసారి అవకాశం కల్పించారు. టీడీపీ విషయానికి వస్తే .. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు. 

click me!