నిత్య కళ్యాణం పవన్... సీజన్ లో దోమలాంటివాడు... విజయసాయి విమర్శలు

Published : Nov 16, 2019, 08:08 AM ISTUpdated : Nov 16, 2019, 10:09 AM IST
నిత్య కళ్యాణం పవన్... సీజన్ లో దోమలాంటివాడు... విజయసాయి విమర్శలు

సారాంశం

రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పుడు ఏకగ్రీవ తీర్మాణం చేశారు కదా అని ప్రశ్నించారు. అప్పుడెందుకు అబ్జక్సన్ చెప్పలేదన్నారు. అంతా ఏకగ్రీవంగా తీర్మాణం చేస్తేనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి అయ్యిందన్నారు.   

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ సీజన్ లో వచ్చే దోమలాంటి వాడంటూ కామెంట్స్ చేశారు. పవన్‌తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబుపై శుక్రవారం ఆయన ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

 ‘‘నిత్య కల్యాణం’ పవన్‌ గురించి సోషల్‌ మీడియాలో ఏమనుకుంటున్నారంటే.. సీజన్‌లో వచ్చే డెంగీ, చికున్‌ గున్యా వ్యాప్తి చేసే దోమలాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనబడకుండా పోతాడట. ఇన్నాళ్లూ నడిచిందేమోకాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే’’ అని విజయసాయి ట్వీట్‌ చేశారు. ఇసుకపై దీక్ష చేస్తూ చంద్రబాబు మెడలో ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడని.. భవిష్యత్తులో కరువుపై దీక్ష చేయాల్సి వస్తే ఎముకల హారం వేసుకుంటాడేమోనని ఎద్దేవా చేశారు.

కాగా.. పవన్ కళ్యాణ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడుపై కోపంతోనో, గత ప్రభుత్వ విధానాలు నచ్చకనో రాజధానిని తరలించాలని చూస్తే అంతకంటే పెద్ద పొరపాటు మరోకటి లేదన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై ఏం చేశారని నిలదీశారు. 

రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పుడు ఏకగ్రీవ తీర్మాణం చేశారు కదా అని ప్రశ్నించారు. అప్పుడెందుకు అబ్జక్సన్ చెప్పలేదన్నారు. అంతా ఏకగ్రీవంగా తీర్మాణం చేస్తేనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి అయ్యిందన్నారు. 

అనంతరం ప్రధాని నరేంద్రమోదీ వచ్చి శంకుస్థాపన చేయడం అన్నీ జరిగిపోయాయన్నారు. నిర్మాణాలు కూడా జరిగిపోతున్న తరుణంలో రాజధానిపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు పరోక్షంగా లీకులు ఇవ్వడం సరికాదన్నారు. 

రాజధాని నిర్మాణం ఆపేస్తే జగన్మోహన్ రెడ్డికి, బొత్స సత్యనారాయణలకు నష్టం జరగదన్నారు. రాష్ట్రప్రజలకు, రైతులకు, భవన నిర్మాణ కార్మికులకు నష్టం జరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణ పనులు నిలిపివేయడం వల్ల కోటి మంది పస్తులతో, అప్పులతో బాధపడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వ విధానాలు నచ్చకపోయినా, రాజధానికోసం అన్ని ఎకరాల భూమి ఎందుకు అని సందేహం వస్తే సైజు కుదించాలే తప్ప తరలించే ప్రయత్నాలు చేయడం సబబు కాదన్నారు. అమరావతి నిర్మాణం జరిగితే భవన నిర్మాణ కార్మికులు బాగుపడతారని సూచించారు.  

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై ఏం చేశారంటూ తిట్టిపోశారు. రాజధాని భూసేకరణను అడ్డుకునే దమ్ము వైసీపీకి లేకుండా పోతే తనను ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. వైసీపీ పిలిస్తేనే తాను అమరావతి వచ్చాననని భూసేకరణను అడ్డుకుంది తానేని చెప్పుకొచ్చారు. జనసేనకు ఉన్న దమ్ము వైసీపీకి లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

లేనిపక్షంలో పులివెందులలో రాజధాని పెట్టుకుంటారంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తాను కూడా అక్కడకే వస్తానన్నారు. అమరావతి రాజధానిని పులివెందులలో పెట్టుకుంటానని 151 మంది ఎమ్మెల్యేలతో తీర్మానం చేయండంటూ ఎద్దేవా చేశారు. 

తాను ఏడాదిపాటు బయటకు రాకూడదనకున్నానని పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలనుకున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే వైసీపీ విధివిధానాలు నచ్చక బయటకు రావాల్సి వచ్చిందన్నారు. వచ్చేలా ప్రభుత్వం పనిచేసిందన్నారు. 

తాను రెగ్యులర్ రాజకీయ నాయకుడిని కాదన్న పవన్ కళ్యాణ్ సగటు మనిషికి న్యాయం చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వైసీపీ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తే అభినందిస్తానన్నారు. 

తన మాటలు విని వైసీపీ ఎమ్మెల్యేలు బాధపడుతున్నారంటూ చురకలంటించారు. తాను శాపనార్థాలు పెడుతున్నానని వారు భయపడుతున్నారంటూ సెటైర్లు వేశారు. శాపనార్థాలు పెట్టడానికి తాను ఎవరినన్నారు. తానేమీ రుషిని కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గొప్ప పని ఏదైనా చేసి ఉందంటే అది 50 మంది భవన నిర్మాణ కార్మికులను చంపడమేనన్నారు. భవన నిర్మాణ కార్మికులు చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

ఇలాంటి ఘటనలే ఎమ్మెల్యేల ఇంట్లో జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా చీపురుపల్లిలో వీరంగం చెయ్యరా అంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు తమ పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. చక్కటి పాలన అందించాలని సూచించారు. లేని పక్షంలో తాము తిరగబడాల్సి వస్తోందని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు చాలా బలమైన వారని సైద్ధాంతిక బలంతో రాజకీయాల్లోకి వచ్చిన వారేనని తెలిపారు. తమ పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకోవాలన్నారు.  

ప్రస్తుత రాజకీయాల్లో కొందరు అవకాశాలను వెతుక్కుంటూ ఇతర పార్టీలకు వెళ్లిపోయారని జనసేనను వీడిన వారిపై పవన్ కళ్యాణ్ విమర్శించారు. దొడ్డిదారిలో జనసేనలో చేరాలనుకుంటే తాను అంగీకరించబోనన్నారు. 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu