కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విజయవాడ: దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది మరియు అర్చకుల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధ్యనత ఇవ్వాలని అధికారులకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. వారికి, వారి కుటుంబసభ్యుల ఆరోగ్య భద్రత నిమిత్తం రాష్ట్రంలోని దేవాలయాల పరిధిలో అవసరమైన మేరకు వైద్య సిబ్బంది సహాకారంతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడంతో అందరికి వ్యాక్సిన్ వేయించాలని మంత్రి సూచించారు.
కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ... దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది, అర్చకులు విధిగా మాస్క్ ధరించడంతో పాటు వచ్చే భక్తులు కూడా మాస్క్ ధరించే విధంగా అవగాహన, ప్రచారం చేయాలన్నారు. దేవాలయాలకు వచ్చే ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటించేలా చేపట్టడంతో పాటు మార్కింగ్ వేయించాలన్నారు. ముఖ్యంగా అన్ని దేవాలయాల్లోనూ భక్తులకు అందుబాటులో శానిటైజర్లు ఏర్పాటు చేయడం, విధిగా శానిటేషన్ చేయించడం జరగాలన్నారు.
read more విమర్శలు చేస్తున్నారు కానీ.. కనీసం ఒక్క సలహా ఇచ్చారా: చంద్రబాబుపై ఆళ్ల నాని ఫైర్
భక్తుల దర్శన సమయంలో అవసరం మేరకు మార్పులు చేసుకోవాలన్నారు మంత్రి. అదే విధంగా భక్తుల నియంత్రణకు ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ని అవకాశం ఉన్న ప్రతి దేవాలయం అమలు చేయాలని సూచించారు. అలాగే అన్ని ప్రముఖ దేవాలయల్లో అయ్యవారికి, అమ్మవారికి యధావిధిగా ఏకాంతంగా పూజలు, సేవలు కొనసాగించాలన్నారు. ఇటీవల సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన ఈ-పూజ, ఈ-సేవలకు అధిక ప్రాధ్యానత ఇవ్వాలన్నారు. దేవాలయాల్లో పరోక్ష పూజలు ప్రత్యక్ష ప్రసారం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
దేవాలయాల భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, సెక్యూరిటిని పెంచడం వంటి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో దేవాదాయ శాఖ సెక్రటరీ వాణీమెహన్, దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావు, రిజనల్ జాయింట్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లు, అసిసెంట్ కమిషనర్లు, ఈవోలు తదితరులు పాల్గొన్నారు.