టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ నేత, మంత్రి మేరుగ నాగార్జున. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక యాత్రకు ఎన్నికలతో సంబంధం లేదన్నారు . వెనుకబడిన కులాలను అక్కున చేర్చుకున్న జగన్ ఆలోచన ఈ యాత్ర అని మంత్రి ప్రశంసించారు. వెనుకబడిన కులాలను తక్కువ చేసి మాట్లాడే చంద్రబాబు హయాంలో అనేక కులాలను వెలి వేసిన పరిస్థితి వుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక విప్లవానికి ప్రతీక ఈ యాత్ర అని మంత్రి నాగార్జున అన్నారు. వెనుకబడిన కులాలను , వర్గాలను సీఎం వైఎస్ జగన్ రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నారని మంత్రి కొనియాడారు.
జగన్ అణగారిన వర్గాలకు రెండున్నర లక్షల కోట్లు ఖర్చు పెట్టారని నాగార్జున తెలిపారు. చంద్రబాబు దొరికిన దొంగ అని.. మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన వర్గాలు అప్రమత్తంగా వుండాలని.. మరోసారి జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి కోరారు. ప్రజల కోసమే జగన్ నిరంతరం పనిచేస్తున్నారని .. అణగారిన వర్గాలను పైకి తీసుకురావడమే సామాజిక సాధికారత బస్సు యాత్ర లక్ష్యమని మేరుగ నాగార్జున తెలిపారు.
Also Read: ప్రజలను మోసం చేయడంలో నిపుణుడు.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఇకపోతే.. చంద్రబాబు నాయుడు, టీడీపీ పాలనను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. టీపీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు. అయితే, 2019 ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని ప్రకటించిన 99 శాతం హామీలను నెరవేర్చిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అనుభవంతో ఆయనకు ప్రజలు పట్టం కట్టారని మంత్రి అన్నారు.
కానీ దీనిని మర్చిపోయి ప్రజల సంక్షేమ కోసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రుణాలను మాఫీ చేయకపోవడంతో ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి జరగడం లేదని టీడీపీ మద్దతు ఉన్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సంస్థలు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రసక్తే లేదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నదని తెలిపారు. ప్రతిపక్షాలు పెట్రోలు, డీజిల్ వంటి నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని ఆరోపిస్తున్నారు. వారి మద్దతు ఉన్న వీడియా సంస్థలు ఇదే ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ ధరలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయనేది గుర్తించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎత్తిచూపారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పాకిస్థాన్లో చిక్కుకున్న మత్స్యకారులను వెనక్కి తీసుకొచ్చినందుకు సీఎం జగన్ను కొనియాడారు.