చంద్రబాబు మాటలు వింటే పవన్, ఎన్టీఆర్‌ల గతే: హీరో రామ్‌కు కొడాలి నాని హితవు

Siva Kodati |  
Published : Aug 25, 2020, 03:41 PM IST
చంద్రబాబు మాటలు వింటే పవన్, ఎన్టీఆర్‌ల గతే: హీరో రామ్‌కు కొడాలి నాని హితవు

సారాంశం

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో హీరో రామ్ ట్వీట్స్ స్పందించడంపై రాజకీయ, సినీ వర్గాల్లో కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా మండిపడ్డారు.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో హీరో రామ్ ట్వీట్స్ స్పందించడంపై రాజకీయ, సినీ వర్గాల్లో కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా మండిపడ్డారు. ఈ క్రమంలో హీరో రామ్ ట్వీట్స్‌కు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు.

రామ్ చంద్రబాబు మాట వినకపోవడం మంచిదని సలహా ఇచ్చారు. చంద్రబాబు  ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో ఎలా చేరారో, తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఎన్టీఆర్‌కు ఎలా వెన్నుపోటు పొడిచారో, పార్టీ, పదవిని ఎలా తీసుకున్నారో ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలని నాని అన్నారు.

చంద్రబాబు మాటలు వింటే సినిమా కెరీర్, రాజకీయ జీవితం ఏమవుతుందో అడగాలనుకుంటే.. ఆయన తోటి ఆర్టిస్టులు పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌లను అడిగితే చెబుతారని మంత్రి హితవు పలికారు. ఏ తప్పు చేయకపోతే డాక్టర్ రమేశ్ ఎందుకు పారిపోతారని నాని ప్రశ్నించారు.

Also Read:హీరో రామ్, చంద్రబాబులపై 'కమ్మ' వ్యాఖ్యలు: చిక్కుల్లో వల్లభనేని వంశీ

రమేశ్ ఆసుపత్రి యజమాని వెనుక బడా నాయకులు ఉన్నారని, రమేశ్ ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసునని చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ తలదాచుకున్నారని కొడాలి నాని ఆరోపించారు.

ఏ సామాజిక వర్గంపైనా కక్షసాధించాల్సిన అవసరం లేదని.. మహిళల్ని ముందు పెట్టుకుని రమేశ్ పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అల్జీమర్స్  వ్యాధితో బాధపడుతున్నారని.. ఆయన కమ్మ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని నాని దుయ్యబట్టారు.

తనకు విరాళాలు ఇచ్చే వారికి అనుకూలంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. రమేశ్ ఆసుపత్రి నిబంధనలు ఉల్లంఘించిందని, డాక్టర్ రమేశ్‌ను రక్షించేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రయత్నం జరుగుతోందని మంత్రి ఆరోపించారు.

రమేశ్‌కు చంద్రబాబు కాపలా కాసినా అరెస్ట్ చేస్తామని, బాధితుల పరామర్శకు వస్తే కరోనా వస్తుందని హైదరాబాద్‌లో దాక్కున్నారని, తనకు కూడా ఎక్స్‌గ్రేషియా వస్తుందని బాబు భయపడుతున్నాడని నాని సెటైర్లు వేశారు.

కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం వైఎస్ జగన్‌కు లేదని, చంద్రబాబుకు వయస్సు పెరిగినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. కాగా విజయవాడ స్వర్ణ ప్యాలెస్ రమేశ్ ఆసుపత్రి కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాద ఘటనపై హీరో రామ్ స్పందించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్‌పై కుట్ర జరుగుతోందని.. అలాగే కుల వైరస్ అంటూ ట్వీట్ చేసి కలకలం రేపారు. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu