పోలెండ్‌కు 1800 కోట్లు హవాలా .. పవన్ రెడ్‌ హ్యాండెడ్‌గా బుక్, కేంద్రం వద్ద ఆధారాలు : మంత్రి దాడిశెట్టి సంచలనం

By Siva KodatiFirst Published Jan 13, 2023, 4:40 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా. రూ.1800 కోట్లు పోలెండ్‌కు హవాలా చేస్తూ కేంద్రానికి దొరికిపోయాడని, దీనికి సంబంధించిన ఆధారాలు కేంద్రం వద్ద వున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 

వైసీపీ నేతలు , మంత్రులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీలో అధికార పక్షం నుంచి గట్టిగా కౌంటర్లు వస్తున్నాయి. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏనాడో చనిపోయిన చంద్రబాబు పార్టీని బతికించడానికి పవన్ ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. బలమైన కాపు సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ .. పవన్ దూషణలు చేశారని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి కాపులకు అండగా వుంటున్నారని.. అలాంటి వ్యక్తిని కూడా దూషించడం సరికాదని దాడిశెట్టి రాజా చురకలంటించారు. కాపులను పవన్ తన యజమాని చంద్రబాబుకు అప్పగించారని ఆయన దుయ్యబట్టారు. 

వైఎస్సార్ పేరెత్తే అర్హత పవన్‌కు లేదని.. గతంలో వైఎస్ దెబ్బకు ప్రజారాజ్యం పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, ఇప్పుడు జగన్ దెబ్బకు జనసేన పార్టీకి కూడా అదే గతి పట్టడం ఖాయమని దాడిశెట్టి రాజా జోస్యం చెప్పారు. పవన్ రూ.1800 కోట్లు పోలెండ్‌కు హవాలా చేస్తూ కేంద్రానికి దొరికిపోయాడని, దీనికి సంబంధించిన ఆధారాలు కేంద్రం వద్ద వున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాను అడ్డుకోవడం వల్ల రూ.30 కోట్లు పోయాయని పవన్ అంటున్నారని.. ఆ సినిమా ప్రొడక్షన్ ఖర్చులే రూ.20 కోట్లు దాటలేదంటూ దాడిశెట్టి రాజా దుయ్యబట్టారు. నాసిరకం సినిమాను జనం చూడకపోతే.. దానికి ప్రభుత్వం ఏం చేస్తుందని మంత్రి ప్రశ్నించారు. 

ALso REad: జగన్ ఏనుగు, పవన్ కుక్క.. మొరగడం కామన్, ఆయనో కామెడీ పీస్ : అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు,పవన్ ఒక్కటేనని తాము ముందు నుంచి చెబుతున్నామని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. పవన్ జోకర్ చేష్టలు, బ్రోకర్ చేష్టలకు కాపులంతా ఆయనను అసహ్యించుకుంటున్నారని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సభలకు వచ్చే యువతను పవన్ రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ ఎంతమందితో వచ్చినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. 175 స్థానాల్లో గెలిచి తీరుతామని రాజా ధీమా వ్యక్తం చేశారు. 

click me!