
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు అవార్డులు ప్రకటించారు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్ధులు చదువుకుంటారని అన్నారు. వారిని తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో నిలబడేలా చేస్తున్నామని .. మంచి మార్కులు సాధించిన విద్యార్ధులకు మరింత ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించామని బొత్స తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 23న నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి అవార్డులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 27న జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు అవార్డులు అందిస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
అలాగే ఈ నెల 31న రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులను, ప్రిన్సిపాళ్లు, హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులను సత్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. దాదాపు 2831 మందిని సత్కరిస్తామని బొత్స తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్ధులకు పతకం, మెరిట్ సర్టిఫికేట్.. జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన విద్యార్ధికి రూ.50 వేలు, సెకండ్ ప్లేస్ రూ.30 వేలు, థర్డ్ ప్లేస్కి రూ.10 వేలు ఇస్తామన్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన విద్యార్ధికి రూ. లక్ష, సెకండ్ ప్లేస్ రూ.75 వేలు, థర్డ్ ప్లేస్ రూ.50 వేలను నగదు బహుమతిగా ఇస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.