చంద్రబాబుకు లాభం చేయడమేనా పవన్ పని.. జనసేన వీర మహిళలు ఎవరి మీద వీరత్వం ప్రదర్శిస్తున్నారు?: మంత్రి అంబటి

By Sumanth KanukulaFirst Published Oct 12, 2022, 6:55 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలి, బాధ కలుగుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలి, బాధ కలుగుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసైనికులు, వీర మహిళలు ఎవరి మీద వీరత్వం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. ‘‘మీ నాయకుడు పవన్ కల్యాణ్‌కు స్పష్టత ఉందా?’’ అని ప్రశ్నలు సంధించారు. 175 స్థానాల్లో పోటీ చేస్తామనే దమ్ము జనసేకు ఉందా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే దానిపై కూడా పవన్‌కు కార్లిటీ లేదని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు నాయుడు విసిరే మెతుకుల కోసం పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఏమిటని ప్రశ్నించారు. ఎప్పుడు చంద్రబాబుకు లాభం చేయడమేనా పవన్ కల్యాణ్‌ పని అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ అమ్ముడు పోవడానికే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జనసేన రాజకీయ పార్టీనే కాదని.. అది కాలగర్భంలో కలిసిపోయే పార్టీ అని విమర్శించారు. 

అదే సమయంలో టీడీపీ ముసుగులో అమరావతి రైతుల పాదయాత్ర సాగుతుందని ఆరోపించారు. అమరావతి‌లో భూములు కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతులు చేసే ఒళ్లు బలిసిన యాత్ర వల్ల ఉత్తరాంద్ర ప్రజలు చైతన్య వంతులవుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయనకు సపోర్ట్ చేసే దుష్ట చతుష్టయానికి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసి.. ప్రారంభించారా? అని ప్రశ్నించారు. వంశధారపై ఒరిసాతో  విభేదాలు ఉన్నాయని చెప్పిన మంత్రి అంబటి రాంబాబు.. ఆ సమస్య పై సీఎం జగన్ దృష్టి పెట్టారని తెలిపారు. రాజకీయంగా కుట్రతోనే అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. మర్యాదగా యాత్ర మానుకొని చంద్రబాబు దగ్గరకు వెళ్లాలని అన్నారు. 

click me!