‘తలకు తల’.. ఏపీలో ఆటవిక న్యాయం.. పంచాయతీ తీర్మానంతో వ్యక్తి దారుణ హత్య..ఆలస్యంగా వెలుగులోకి..

Published : Jun 02, 2022, 08:23 AM IST
‘తలకు తల’.. ఏపీలో ఆటవిక న్యాయం.. పంచాయతీ తీర్మానంతో వ్యక్తి దారుణ హత్య..ఆలస్యంగా వెలుగులోకి..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక న్యాయంతో దారుణ ఘటన జరిగింది. ఘర్షణలో ఓ వ్యక్తి చనిపోగా.. అతని కుటుంబసభ్యులు.. తలకు తల.. అంటూ దానికి కారణమైన వ్యక్తిని చంపేలా ప్రోత్సహించారు. 

సీతంపేట : ‘మా నాన్న ఎలా చనిపోయాడో మీ వాడు కూడా అలాగే చనిపోవాలి… తలకు తలకు పోవాలి. లేదంటే అందర్నీ చంపేస్తాం’  అన్న మాటలకు ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా భయపడ్డారు. ఏం చేయాలో తెలియక, తమ కుటుంబంలోనే మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని చంపేశారు. పంచాయతీ తీర్మానంతో జరిగిన ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. ఈ కేసు వివరాలను పాలకొండ డిఎస్పి ఎం శ్రావణి బుధవారం వెల్లడించారు.  సీతంపేట మండలం రేగులగూడలో మే 27న జరిగిన ఓ పెళ్లిలో గ్రామానికి చెందిన సవర గయా(60) కుమార్తె పద్మను ఉసిరికిపాడుకు చెందిన మతిస్థిమితం లేని  సవర సింగన్న (33) కర్రతో కొట్టాడు, 

దీంతో సింగన్నను గయా కిందకి తోసేశాడు. సింగన్న కోపంతో అతనిపై పెద్ద కర్రతో దాడిచేయగా గయా అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారి గయా కుమారులు, స్థానికులు సింగన్న కాళ్లు, చేతులు కట్టేసి ఓ ఇంట్లో బంధించారు. అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు సమాచారం అందించారు. అందరూ వచ్చాక పంచాయతీ నిర్వహించి.. తమ తండ్రి ఎలా చనిపోయాడో ఇతను కూడా అలాగే చనిపోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కుటుంబంలో అందరిని చంపేస్తామని  బెదిరించారు.

దీంతో పెద్దలందరూ ‘తలకు తల’ అని తీర్పు చెప్పారు. కుటుంబంలో అందరి ప్రాణాలు తీస్తారని భయపడిన సింగన్న కుటుంబసభ్యులు తీర్పు అమలుకు అంగీకరించారు. ఈనెల 28న సింగన్నకు విషం ఇచ్చారు. అతను చనిపోలేదని గుర్తించి.. ఉరి వేశారు. ఆ తరువాత ఎవరికీ తెలియకుండా శవాన్ని కాల్చి వేశారు.  అయితే ఈ మరణాన్ని మొదట గ్రామస్తులంతా.. మామూలు మరణంగా భావించినా..  గ్రామంలోని రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా సమాచారం తెలుసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.

రెండు రోజుల్లోనే  మర్డర్ మిస్టరీ చేధించామని అన్నారు. పాలకొండ సీఐ జి శంకర్రావు, ధోను బాయి, బత్తిలి, పాలకొండ ఎస్సైలు  kishore varma, డి అనిల్ కుమార్,ప్రసాద్ ఆయా ప్రాంతాలకు వెళ్లి వివరాలు సేకరించారని రెండూ హత్యలుగా తేలినట్లు చెప్పారు. హత్యలకు కారకులు, ప్రేరేపించిన వారు, పంచాయతీ నిర్వహించిన పెద్దలు.. ఇలా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update : చలికి గుడ్ బై.. ముదురుతున్న ఎండలు, ఈ ప్రాంతాల్లోనే హయ్యెస్ట్ టెంపరేచర్స్
Ishan Kishan : 6 6 6 6 6 ఇషాన్ కిషన్ కా బాప్.. సిక్సర్ల మోతతో నమీబియా పని ఖతం