నా గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదు.. అలా అని నిరూపిస్తారా?: మాజీ ఎంపీ కొనకళ్ల

Published : Jun 12, 2022, 03:16 PM IST
 నా గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదు.. అలా అని నిరూపిస్తారా?: మాజీ ఎంపీ కొనకళ్ల

సారాంశం

వైసీపీ ఎంపీ బాలశౌరిపై టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఫైర్ అయ్యారు. పేర్ని నాని, తనకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పేర్ని నానితో పంచాయితీలో తన పేరు ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. 

వైసీపీ ఎంపీ బాలశౌరిపై టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఫైర్ అయ్యారు. పేర్ని నాని, తనకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పేర్ని నానితో పంచాయితీలో తన పేరు ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. ఏ ఆధారంతో పేర్ని నానికి, తనకు సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి ఆరోపించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను, నాని వారానికొకసారి సమావేశం అవుతున్నట్టుగా బాలశౌరి నిరూపిస్తారా అని బాలశౌరికి సవాలు విసిరారు. 

పేర్ని నాని తనకు ఓ రాజకీయ ప్రత్యర్థి అని.. ఎవరి రాజకీయం వారిదేనని చెప్పారు. తన గురించి మాట్లాడే అర్హత బాలశౌరి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధార వ్యాఖ్యలు చేసిన బాలశౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది.. 
మచిలీపట్నం వైసీపీలో కొంతకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న వర్గ విభేదాలు. ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎంపీ వల్లభనేని బాలశౌరి పర్యటనను వైసీపీకే చెందిన నగర కార్పొరేటర్ అడ్డుకునే ప్రయత్నం చేయటం మచిలీపట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ కోసం పనిచేసినప్పటికీ బాలశౌరి ప్రాధాన్యతివ్వడం లేదంటూ.. పేర్నినాని అనుచరుడు అజ్గర్‌ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాలశౌరి పర్యటనను అజ్గర్‌ వర్గీయులు అడ్డుకున్నారు. బాలశౌరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం జగన్ చెప్పారనే బాలశౌరిని గెలిపించామని .. కానీ తమను ఎంపీ పట్టించుకోవడం లేదంటూ అజ్గర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే తనను అడ్డుకోవడంపై ఎంపీ బాలశౌరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేర్ని నాని తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆరోపించారు. టీడీపీ నేత కొనకళ్లతో అధికార పార్టీ ఎమ్మెల్యేకు పనేంటీ అని ప్రశ్నించారు. కొనకళ్ల నారాయణ, బీజేపీ నేత సుజనా చౌదరి వంటి వారితో నాని అంటకాగుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారని అన్నారు.

తాను బందరులోనే ఉంటానని.. ఎవరేం చేస్తారో చూస్తానంటూ బాలశౌరి కామెంట్ చేశారు. తాటాకు చప్పుళ్లకు, ఊడుత ఊపుళ్లకు భయపడేది లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంను విమర్శించిన కార్యక్రమంలో పేర్ని నాని ఎందుకు పాల్గొన్నారని బాలశౌరీ ప్రశ్నించారు. సుజనా చౌదరి, పేర్ని నాని ఒకరినొకరు పొగుడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అయితే బాలశౌరి కామెంట్స్ పేర్ని నాని స్పందించలేదు. అయితే త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తామని పేర్నినాని వర్గం చెబుతోంది. ఎంపీ చెప్పినవి అన్ని అబద్దాలు అని కొట్టిపారేసింది.

ఇక, ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని వర్గాల మధ్య చెలరేగిన వివాదంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి తప్పితే ఇలా మీడియాకెక్కి రచ్చకెక్కడం సరికాదని, మౌనంగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!